Uttarakhand: పూజకు ఆటంకం కలిగించారని క్రూరత్వం.. తన కుటుంబం మొత్తాన్ని చంపేసిన వ్యక్తి..
ABN , First Publish Date - 2022-08-31T02:14:07+05:30 IST
తన పూజకు ఆటంకం కలిగించారనే కారణంతో ఒక వ్యక్తి అతి క్రూరంగా ప్రవర్తించాడు.
తన పూజకు ఆటంకం కలిగించారనే కారణంతో ఒక వ్యక్తి అతి క్రూరంగా ప్రవర్తించాడు. తల్లిని, భార్యను, ముగ్గురు పిల్లలను అంతమొందించాడు. ఈ సంచలన ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand)లో వెలుగు చూసింది. రాణిపోఖ్రీలోని నాగఘేర్ ప్రాంతంలో మహేష్ కుమార్(47) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతను గత పదేళ్లుగా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే పూజలు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. స్పెయిన్లో ఉంటున్న సోదరుడు ప్రతి నెల పంపించే డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇది కూడా చదవండి..
Viral: యువతిని చూసి పారిపోయిన యువకుడు.. వెంటబడి మరీ పట్టుకున్న యువతి ఏం చేసిందంటే..
సోమవారం ఉదయం మహేష్ ఇంట్లో పూజలు చేస్తున్నాడు. ఆ సమయంలో భార్య నీతూ దేవి (36) అతడిని పిలిచింది. వంట చేస్తుండగా గ్యాస్ అయిపోయిందని, సిలిండర్ను మార్చాలని కోరింది. దీంతో మహేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నేరుగా వంట గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న కూరగాయలు కోసే కత్తితో నీతూని పొడిచాడు. తల్లి కేకలు విని పరిగెత్తుకు వచ్చిన ముగ్గురు కూతుళ్లను చంపేశాడు. అనంతరం కన్న తల్లిని కూడా అంతమొందించాడు. వారి కేకలు విని పొరిగింట్లో ఉండే వ్యక్తి మహేష్ ఇంటికి వెళ్లాడు.
తలుపు మూసి ఉండడంతో కిటికీ నుంచి చూడగా ఇంట్లో వారందరినీ మహేష్ కత్తితో పొడిచి చంపడం కనిపించింది. దీంతో అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టమ్కు తరలించారు. నిందితుడైన మహేష్ కుమార్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.