కాపురానికి రాలేదని...
ABN , First Publish Date - 2022-08-17T05:41:39+05:30 IST
తమిళనాడులోని పుట్టింట్లో ఉన్న భార్యను హత్య చేసిన భర్త, కుప్పంలో పోలీసులకు లొంగిపోయిన ఉదంతమిది. కుప్పం అర్బన్ సీఐ టి.శ్రీధర్ అతడిని విచారించి తమిళనాడు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు నిందితుడు వేలుమురుగన్ను తమ అదుపులోకి తీసుకున్నారు.
భార్యను నరికి చంపేశాడు
కుప్పం, 16: తమిళనాడులోని పుట్టింట్లో ఉన్న భార్యను హత్య చేసిన భర్త, కుప్పంలో పోలీసులకు లొంగిపోయిన ఉదంతమిది. కుప్పం మండలం మహమ్మద్పురం పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన వేలుమురుగన్కు అరుళ్మొళి(28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో భర్తతో గొడవ పడిన అరుళ్మొళి నాలుగు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా, జీవనందపురంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె తిరిగి రాకపోయేసరికి వేలుమురుగన్ అత్తగారింటికి వెళ్లాడు. కాపురానికి రమ్మని భార్యను పిలిచాడు. అయితే ఆమె తిరస్కరించడంతో అరుళ్మొళిని సోమవారం రాత్రి కత్తితో నరికి హత్య చేశాడు. తర్వాత మంగళవారం కుప్పం వచ్చి అర్బన్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. కుప్పం అర్బన్ సీఐ టి.శ్రీధర్ అతడిని విచారించి తమిళనాడు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు నిందితుడు వేలుమురుగన్ను తమ అదుపులోకి తీసుకున్నారు.