సింగపూర్లో భారతీయుడి హత్య.. చైనా దేశస్థుడికి ఎనిమిదిన్నరేళ్ల జైలుశిక్ష
ABN , First Publish Date - 2020-09-22T07:48:25+05:30 IST
భారత సంతతికి చెందిన అల్లుడిని హతమార్చిన కేసులో చైనా సంతతికి చెందిన వ్యాపారస్థుడికి
సింగపూర్: భారత సంతతికి చెందిన అల్లుడిని హతమార్చిన కేసులో చైనా సంతతికి చెందిన వ్యాపారస్థుడికి సింగపూరు కోర్టు సోమవారం ఎనిమిదిన్నరేళ్ల జైలుశిక్షను విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాన్ నామ్ సెంగ్(72) అనే వ్యాపారస్తుడి కూతురిని స్పెన్సర్ తుపాని(38) అనే భారతీయుడు వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత వ్యాపార బాధ్యతలను తాన్ నామ్ సెంగ్ అల్లుడికి అప్పగించగా.. తుపాని మోసాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడు. అయినప్పటికి వీరంతా ఒక ఇంట్లోనే నివసిస్తూ వచ్చారు.
అయితే తుపానిలో ఎటువంటి మార్పు రాకపోగా.. తనను, తన కూతురిని మరిన్ని కష్టాలు పెడుతున్నాడని తాన్ నామ్ సెంగ్ ఆగ్రహానికి గురయ్యాడు. 2017 జూలై 10వ తేదీన ఓ రెస్టారెంట్లో తుపాని లంచ్ చేస్తుండగా.. తాన్ నామ్ సెంగ్ అక్కడకు వెళ్లి కత్తితో పొడిచి తుపానిని హతమార్చాడు. అల్లుడిని తానే కావాలని చంపానని నేరాన్ని అంగీకరించాడు. ఇక అప్పటి నుంచి ఈ కేసు కోర్టు పరిధిలోనే ఉంటూ రాగా.. సోమవారం తాన్ నామ్ సెంగ్కు ఎనిమిదిన్నరేళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.