గుండెపోటుతో వ్యక్తి మృతి.. కరోనా మరణమని ప్రచారం.. చివరకు..

ABN , First Publish Date - 2020-08-10T16:09:25+05:30 IST

కరోనా భయం మనుషుల మధ్య దూరాన్ని పెంచడమే కాదు.. మానవత్వాన్ని కూడా మరిచిపోయేలా చేస్తోంది. గుండెపోటుతో చనిపోయిన ఓ రైతుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకురాలేదు.

గుండెపోటుతో వ్యక్తి మృతి.. కరోనా మరణమని ప్రచారం.. చివరకు..

భయంతో అంత్యక్రియలకు రాని గ్రామస్థులు

తానున్నానంటూ ముందుకొచ్చిన యువరైతు


పాల్వంచ రూరల్‌ (ఆంధ్రజ్యోతి): కరోనా భయం మనుషుల మధ్య దూరాన్ని పెంచడమే కాదు.. మానవత్వాన్ని కూడా మరిచిపోయేలా చేస్తోంది. గుండెపోటుతో చనిపోయిన ఓ రైతుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకురాలేదు. పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన మల్లాది వెంకయ్య(50) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. ఆదివారం ఉదయం అతడి మృతి వార్త గ్రామంలో అందరికీ తెలిసింది, అదికాస్తా కరోనా మృతిగా ప్రచారం జరిగింది. భయంతో అంత్యక్రియలకు గ్రామస్థులు, బంధువులు ఎవరూ రాలేదు. 


చివరికి గ్రామపంచాయతీ వారిని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన యువరైతు రంజిత్‌కుమార్‌ తన సొంత ట్రాక్టర్‌పై మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో పాల్వంచ మునిసిపల్‌ కమిషనర్‌కూడా స్పందించి ముగ్గురు పురపాలక సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చి వెంకయ్య అంత్యక్రియలకు పంపారు. వారంతా కలిసి కుటుంబ సభ్యులతో అంత్యక్రియలను పూర్తిచేయించారు. దీంతో యువరైతు రంజిత్‌, మునిసిపల్‌ కమిషనర్‌ను వెంకయ్య కుటుంబసభ్యులు, బంధువులు అభినందించారు. ఇప్పటికైనా సాధారణ మరణాలను కూడా కరోనా మరణాలుగా చిత్రీకరించి మానవత్వం లేని పనులకు పాల్పడవద్దని యువరైతు రంజిత్‌ కుమార్‌ కోరారు.

Updated Date - 2020-08-10T16:09:25+05:30 IST