డిశ్చార్జి అయిన 24 గంటలకే కరోనా బాధితుడి మృతి.. దగ్గరకు రాని బంధువులు
ABN , First Publish Date - 2020-08-11T21:34:20+05:30 IST
కడప జిల్లా రాజుపాళెం మండలంలోని టంగుటూరుకు చెందిన ముస్లిం వ్యక్తి (42) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం కిందట ఇతనికి కరోనా
స్వచ్ఛంద సంస్థల ద్వారా అంత్యక్రియలు
రాజుపాళెం/కడప (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా రాజుపాళెం మండలంలోని టంగుటూరుకు చెందిన ముస్లిం వ్యక్తి (42) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం కిందట ఇతనికి కరోనా సోకడంతో కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో చేరారు. శనివారానికి ఎనిమిది రోజులు కావడంతో పేషెంట్ యాక్టివ్గా ఉన్నాడని వైద్యసిబ్బంది డిశ్చార్జి చేశారు. దీంతో అతను ఇంటికి చేరుకున్నాడు. ఇతడికి కరోనా అని తేలిన రోజే భార్య, పిల్లలు కూడా స్వాబ్ టెస్టింగ్కు ఇచ్చారు. ఆ ఫలితాలు శనివారం వచ్చాయి. వారందరికీ పాజిటివ్ వచ్చింది. వైద్య సిబ్బంది వారికి మాత్రలు ఇచ్చి సోమవారం ఆసుపత్రికి తీసుకెళతామని చెప్పారు. కాగా కరోనాకు చికిత్స పొంది శనివారం సాయంత్రానికి ఇంటికి చేరుకున్న కుటుంబపెద్దకు ఆదివారం రాత్రికి ఆయాసం పెరిగింది. దీంతో అతను ఊపిరితీసుకోలేని పరిస్థితికి చేరుకుని మృతిచెందాడు. ఆదివారం అర్ధరాత్రి అతను చనిపోయాడని తెలిసినా దగ్గరి బంధువులు కూడా స్పందించలేదు. చివరకు వారి కుటుంబంలోని ఒక వ్యక్తి స్వచ్ఛంద సంస్థలకు తెలియజేయడంతో వారు సోమవారం ఉదయం 11 గంటలకు అదే గ్రామంలోని శ్మశానంలో కరోనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. అతడి భార్యాపిల్లలను ప్రొద్దుటూరు కరోనా సెంటర్కు తరలించారని స్థానికులు తెలిపారు.