లాక్డౌన్ ఎఫెక్ట్: గాయపడిన భార్యను 12 కిలోమీటర్లు సైకిల్పై...
ABN , First Publish Date - 2020-03-27T14:23:48+05:30 IST
ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అష్టదిగ్బంధనం కొనసాగుతున్న నేపథ్యంలో...
లూదియానా: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అష్టదిగ్బంధనం కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఓ దయనీయ గాథ వెలుగులోకి వచ్చింది. యాక్సిడెంట్లో గాయపడిన తన భార్యను ఓ వ్యక్తి తన సైకిల్పై ఎక్కించుకుని 12 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి కాలినడకన వెళ్లాడు. లాక్డౌన్ నేపథ్యంలో వాహనాలు అందుబాటులో లేవనీ... అంబులెన్స్ సిబ్బంది రూ.2 వేలు డిమాండ్ చేయడంతో ఇలా వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంజాబ్లోని లూదియానాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
‘‘లాక్డౌన్ కారణంగా మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్స్ డ్రైవర్లు రూ.2 వేలు అడిగారు. అంత డబ్బు చెల్లించలేక నేనే సైకిల్పై ఎక్కించుకుని తీసుకెళ్లాను..’’ అని సదరు మహిళ భర్త దేవ్దత్ రామ్ వెల్లడించాడు. ఆమె ఈ నెల 20న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా అక్కడ జరిగిన ప్రమాదంలో గాయపడిందనీ... ఫ్యాక్టరీ కార్మికులు ఆమెను భరత్ నగర్లోని ఓ ఆస్పత్రిలో చేర్చారని తెలిపాడు. అయితే వైద్యులు ఆమెకు ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్టు చెప్పడంతో కంగన్వాల్లోని మరో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని దేవ్దత్ పేర్కొన్నాడు.