శారదా నది ఒడ్డున వ్యక్తి దారుణ హత్య
ABN , First Publish Date - 2020-08-10T10:21:51+05:30 IST
పట్టణంలోని శారదా నది ఒడ్డున శనివారం రాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పాత కక్షలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
అనకాపల్లి టౌన్, ఆగస్టు 9 : పట్టణంలోని శారదా నది ఒడ్డున శనివారం రాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పాత కక్షలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పట్టణ సీఐ ఎల్.భాస్కరరావు తెలిపిన వివరాలివి. ఇక్కడి శారదా నది ఒడ్డున గల శ్మశానవాటికలో స్థానికేతరుడైన కోమటి నూకరాజు (34) పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ పక్క కరోనా, మరో పక్క సహజ మరణాలతో పనిచేసే చోట ఇతనికి డబ్బులు బాగానే అందేవి. ఇది గమనించిన గవరపాలెం కర్రివారి వీధికి చెందిన మద్దాల పరమేశ్వరరావు డబ్బుల కోసం తనను తరచూ వేధిస్తున్నాడని శ్మశానవాటిక వద్ద ఉన్న పూజారి విశ్వనాథ చంద్రశేఖర శర్మకు నూకరాజు చెప్పేవాడు.
శనివారం సాయంత్రం కూడా పరమేశ్వరరావు శ్మశాన వాటిక వద్దకు వచ్చి గొడవ పడిన విషయాన్ని పూజారికి చెప్పాడు. ఇది తెలుసుకున్న పరమేశ్వరరావు శనివారం రాత్రి శారదానది ఒడ్డున వినాయక నిమజ్జనం ఘాట్ వద్ద నిద్రపోతుండగా నూకరాజు తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వంతెన కింద తరచూ నిద్రపోయే కాగితాలు ఏరుకునే యువకులు కనకసాయి, విజయ్ ఈ పరిస్థితిని చూసి పూజారికి తెలపడంతో ఆయన రాత్రి 11.30 గంటల సమయంలో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి క్లూస్ బృందం చేరుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఇదిలావుంటే, నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. పరమేశ్వరరావుపై గతంలో కూడా పోలీసు కేసులున్నాయని సమాచారం.