పోలీస్ అధికారిని కుక్కతో కరిపించి.. యూనిఫాం చింపి చితకబాదిన యువకుడు.. ఇంతకీ అక్కడేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-20T08:40:06+05:30 IST

రోడ్డుకు అడ్డంగా కారును ఆపేశాడా యువకుడు. తన మిత్రులతో కలిసి పక్కనే జల్సా చేస్తున్నాడు. రాత్రి సమయం కావడంతో రోడ్డుపై రద్దీ లేదు. అయితే అదే సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసు అధికారి.. ఇలా రోడ్డుపై కారు పెట్టడమేంటని ప్రశ్నించాడు...

పోలీస్ అధికారిని కుక్కతో కరిపించి.. యూనిఫాం చింపి చితకబాదిన యువకుడు.. ఇంతకీ అక్కడేం జరిగిందంటే..

రోడ్డుకు అడ్డంగా కారును ఆపేశాడా యువకుడు. తన మిత్రులతో కలిసి పక్కనే జల్సా చేస్తున్నాడు. రాత్రి సమయం కావడంతో రోడ్డుపై రద్దీ లేదు. అయితే అదే సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసు అధికారి.. ఇలా రోడ్డుపై కారు పెట్టడమేంటని ప్రశ్నించాడు. దాన్ని పక్కకు తియ్యాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత మరో రౌండ్ అటువైపు వచ్చాడు. అప్పటికి కూడా కారు అలాగే ఉండటంతో ఆ యువకులపై కోప్పడ్డాడు. 


దాంతో కోపం తెచ్చుకున్న యువకులు.. పోలీసును గట్టిగా పట్టుకొని కుక్కతో కరిపించారు. అక్కడితో ఆగకుండా అతన్ని చితకబాది, యూనిఫాం కూడా చించేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. 


శుభేంద్ర సింహ్ యాదవ్ అనే యువకుడు యూట్యూబర్‌ అని తెలుస్తోంది. గత గురువారం రాత్రి పది గంటలకు రోడ్డుకు అడ్డంగా కారు ఆపేసిన శుభేంద్ర, అతని స్నేహితులు అక్కడ రోడ్డుపైనే జల్సా చేస్తున్నారు. అటుగా గస్తీకి వచ్చిన నవనీత్ అనే ఇన్స్‌పెక్టర్ వారిని గదమాయించాడు. రోడ్డుకు అడ్డంగా కారు తీసేయాలని చెప్పాడు. అతను మరో రౌండ్‌కు వచ్చినప్పుడు కూడా కారు అక్కడే ఉండటంతో కోప్పడ్డాడు. అంతే శుభేంద్ర, అతని స్నేహితులు నవనీత్‌పై దాడి చేశారు. కుక్కతో కరిపించి, చితకబాది, ఫోన్ పారేసి, యూనిఫాం చింపేసి నానా రచ్చ చేశారు. ఇదంతా పోలీస్ స్టేషన్‌కు వంద మీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే కార్తికేయ వర్మ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మిగతా వాళ్లు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు మిగతా వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. సదరు యువకులు ఇళ్లకు కూడా వెళ్లడం లేదని సమాచారం.


Updated Date - 2022-05-20T08:40:06+05:30 IST