ఢిల్లీ విమానంలో మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు
ABN , First Publish Date - 2022-03-04T22:13:17+05:30 IST
విమానంలో తోటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ
బెంగళూరు: విమానంలో తోటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 28న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్న 34 ఏళ్ల బాధిత మహిళతో పక్క సీట్లో కూర్చున్న 29 ఏళ్ల అభిషేక్ కుమార్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు.
విమానం టేకాఫ్ కావడంతో నిద్రలోకి జారుకున్న ఆమె అతడి అనుచిత ప్రవర్తనతో ఒక్కసారిగా మేల్కొంది. తన భుజంపై అతడి చేతులు ఉండడంతో కంగారు పడి కేకలు వేసింది. వెంటనే అతడు ఆమె పైనుంచి చేతులు తీసేశాడు. అయినా, అతడు తన పద్ధతి మార్చుకోలేదు. ఆమెతో మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నిస్తూ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.
అతడి తీరు మారకపోవడంతో విషయాన్ని విమాన సిబ్బందికి చెప్పింది. దీంతో వారు అతడికి మరో సీటు కేటాయించినా వెళ్లేందుకు నిరాకరించాడు. బెంగళూరు విమానాశ్రయంలో విమానం ల్యాండయ్యాక బాధితురాలు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి సమన్లు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా పిలిచినప్పుడు రావాలని ఆదేశించారు.