వ్యక్తి దాడిలో మహిళ మృతి
ABN , First Publish Date - 2021-01-27T06:29:07+05:30 IST
తన కుమారుడిపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన ఒక తల్లి ఆ దాడిలో గాయపడి మృతిచెందింది. కరప ఎస్ఐ దానేటి రామారావు తెలిపిన వివరాల ప్రకారం..
కరప, జనవరి 26: తన కుమారుడిపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన ఒక తల్లి ఆ దాడిలో గాయపడి మృతిచెందింది. కరప ఎస్ఐ దానేటి రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలంక శివారు మొండి గ్రామానికి చెందిన సోదరులు పొన్నాడ చిన్న, అంజియ్య బాకీ విషయమై మంగళవారం మధ్యాహ్నం గొడవ పడ్డారు. అదే గ్రామానికి చెందిన రేకాడి వెంకటేశులు వారిని విడదీసి అన్నపై గొడవ ఏంటని చిన్నను మందలించాడు. దీంతో చిన్న వెంకటేశులు ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డాడు. ఇదంతా చూస్తున్న వెంకటేసులు తల్లి అచ్చియమ్మ(60) తన కుమారుడిపై జరుగుతున్న దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. క్షణికావేశంతో చిన్న అచ్చియమ్మను కాలితో పొత్తికడుపులో బలంగా తన్నాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అచ్చియమ్మను కాకినాడ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. చిన్న పరారీలో ఉన్నాడు. సీఐ మురళీకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.