సైబర్ నేరం కేసులో వ్యక్తి అరెస్ట్
ABN , First Publish Date - 2022-01-27T05:30:00+05:30 IST
సిద్దిపేట పట్టణంలోని త్రీటౌన్ పోలీసులు గురువారం సైబర్ నేరానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని బాధితుడికి డబ్బును ఇప్పించారు.
సిద్దిపేట అర్బన్, జనవరి 27: సిద్దిపేట పట్టణంలోని త్రీటౌన్ పోలీసులు గురువారం సైబర్ నేరానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని బాధితుడికి డబ్బును ఇప్పించారు. త్రీ టౌన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చెల్ జిల్లా బోయిన్పల్లికి చెందిన నిందితుడు దానాల సూరజ్(28) వృత్తిరీత్యా డీజే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతడు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ సతీష్ అనే వ్యక్తితో ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుని కెమెరా ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో సతీష్ ఒకసారి రూ.55వేలు, మరోసారి రూ. 67 వేలను గూగుల్ పే ద్వారా సూరజ్కు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు. మూడు నెలల కాలం గడిచినా కెమెరా ఇప్పించకపోవడంతో పాటు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన సతీష్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రవికుమార్ తమ సిబ్బంది యాదగిరి, బవీన్ కుమార్తో కలిసి కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరిపి రూ. 50 వేలను రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి సైబర్ నేరస్థుడిని అరెస్టు చేసినందుకు త్రీ టౌన్ సీఐ రవికుమార్, సిబ్బంది యాదగిరి, బవీన్ కుమార్లను సీపీ శ్వేత అభినందించారు.