మాజీ సీఎం వేదికపైకి కత్తితో వెళ్లిన వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2022-01-08T01:56:46+05:30 IST

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ ప్రసంగిస్తున్న..

మాజీ సీఎం వేదికపైకి కత్తితో వెళ్లిన వ్యక్తి అరెస్టు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ ప్రసంగిస్తున్న వేదికపైకి కత్తితో దూసుకు వెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు. ఉదంసింగ్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.


కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హరీష్ రావత్ పాల్గొన్నారని, ఆయన ప్రసంగం పూర్తి కాగానే జనంలో ఉన్న 45 ఏళ్ల వ్యక్తి వేదికపైకి కత్తితో దూసుకువచ్చాడని, అక్కడున్న వాళ్లు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారని పోలీస్ సూపరింటెండెంట్ చంద్రమోహన్ సింగ్ శుక్రవారంనాడు తెలిపారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నందున ఆర్మ్ యాక్ట్ కింద నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నిందితుడికి మతిస్థిమితం లేనట్టు తెలుస్తోందని చెప్పారు. వారం రోజుల క్రితం అకారణంగా అతను వాటర్‌హెడ్ ట్యాంకు ఎక్కాడని, తరచు భార్యతో పోట్లాడేవాడని, తమ మధ్య తగాదాను పరిష్కరించాలంటూ ఒక పోలీస్ స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేసినట్టు కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. తాజా ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని కోర్టుకు హాజరు పరుస్తున్నామని చెప్పారు.


కాగా, నిందితుడు కాషాయం రంగు స్కార్ఫ్ ధరించి 'జై శ్రీరామ్' నినాదాలు చేసిన్టటు హరీష్ రావత్ ప్రతినిధి సురేంద్ర అగర్వాల్ తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, కుట్ర కోణాన్ని కొట్టివేయలేమని ఆయన చెప్పారు. 

Updated Date - 2022-01-08T01:56:46+05:30 IST