ఆటోవాలాను బెదిరించి.. రూ.85 దోచుకున్న యువకుడు..!

ABN , First Publish Date - 2020-07-30T02:08:07+05:30 IST

దేశరాజధాని నగరి వీధుల్లో ఓ యువకుడు కలకలం రేపాడు. నాటు తుపాకీతో ఓ ఆటోవాలను బెదిరించి రూ. 85 దోచుకున్నాడు

ఆటోవాలాను బెదిరించి.. రూ.85 దోచుకున్న యువకుడు..!

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరి వీధుల్లో ఓ యువకుడు కలకలం రేపాడు. నాటు తుపాకీతో ఓ ఆటోవాలను బెదిరించి రూ. 85 దోచుకున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుబోతే వారిని కూడా గన్నుతో కాల్చేస్తానంటూ బెదిరించాడు. ఆ తరువాత ఆత్మహత్య చేసుకుంటానంటూ సీన్ మొత్తం మార్చేశాడు. నడిరోడ్డుపై నానా బీభత్సం సృష్టించాడు. ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఢిఫెన్స్ కాలనీలో ఆదివారం నాడు ఈ రభస జరిగింది. సదరు యువకుడిని దమన్ ఆరోరాగా పోలీసులు గుర్తించారు. గతంలో మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేసేవాడని తెలిపారు. ఆండ్రూస్ గంజ్ ప్రాంతంలో ఆటో ఎక్కిన అనంతరం అరోరా బెదిరింపులకు దిగాడని, డ్రైవర్ నుంచి రూ. 85 దోచుకున్నాక మళ్లీ ఆండ్రూస్ గంజ్ ప్రాంతానికే తిరిగొచ్చి ఆటో దిగిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అరోరాకు తెలీకుండా డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్తలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. తుపాకీతో అరోరా బెదిరిస్తున్నప్పటికీ.. అదను చూసి అతడిని లొంగదీసుకున్నామని వారు తెలిపారు. 

Updated Date - 2020-07-30T02:08:07+05:30 IST