మామిళ్లపల్లి ముగ్గురాళ్ల మైనింగ్లో..నిబంధనలకు తూట్లు!
ABN , First Publish Date - 2021-05-10T08:39:17+05:30 IST
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ సమీపంలో తిరుమలపల్లె సమీపంలో సర్వే నంబరు 1, 133 పరిధిలో 30 హెక్టార్లలో కడప నగరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య సతీమణి సి.కస్తూరిబాయి పేరు మీద మైనింగ్
మామిళ్లపల్లి ముగ్గురాళ్ల మైనింగ్లో..నిబంధనలకు తూట్లు!
పేలుడు పదార్థాల రవాణాలో కనీస జాగ్రత్తలే లేవు
సెప్టెంబర్లో లీజు రద్దుకు సిఫార్సు.. అయినా బేఫికర్
నిర్వాహకుడు అధికార పార్టీ నాయకుడనే!
ఎమ్మెల్సీ భార్య పేరిట మైనింగ్కు అనుమతి
2013లో వైసీపీ నేత నాగేశ్వరరెడ్డికి జీపీఏ
గత ఏడాది జిల్లా అధికారుల తనిఖీలు
నిబంధనలు అతిక్రమిస్తున్నారని నిర్ధారణ
ఉల్లంఘనలు నిజమేనని కలెక్టర్ నివేదిక
అప్పుడు చర్యలు తీసుకోనందునే ఇప్పుడు పది మంది బలి
5 శాఖల అధికారులతో కమిటీ: మంత్రి పెద్దిరెడ్డి
నిరుడు సెప్టెంబరులోనే లీజు రద్దుకు సిఫారసు
అయినా పట్టించుకోని ఉన్నతాధికారులు.. నిర్వాహకుడు అధికార పార్టీ నాయకుడనే!
పది మంది కూలీల బతుకులను ఛిద్రం చేసిన ముగ్గురాళ్ల మైనింగ్ పేలుళ్ల ఘటనలో పర్యవేక్షక అధికారుల వైఫల్యం.. నిర్లక్ష్యం స్సష్టంగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుడు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారు. మైనింగ్ లీజు రద్దు చేయాలని అధికారులు సెప్టెంబరులోనే సిఫారసు చేశారు. దానిని ఉన్నతాధికారులు అమలు చేయలేదు. తాజా పేలుడు తర్వాత.. నిబంధనల ఉల్లంఘన వాస్తవమేనంటూ కలెక్టర్ సైతం ప్రభుత్వానికి నివేదిక పంపారు.
(కడప-ఆంధ్రజ్యోతి)
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ సమీపంలో తిరుమలపల్లె సమీపంలో సర్వే నంబరు 1, 133 పరిధిలో 30 హెక్టార్లలో కడప నగరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య సతీమణి సి.కస్తూరిబాయి పేరు మీద మైనింగ్ లీజులు ఇచ్చారు. 2001 నవంబరు 2న 20 ఏళ్లు ముగ్గురాళ్ల తవ్వకం మైనింగ్ కోసం అనుమతులు తీసుకున్నారు. ఈ ఏడాది నవంబరు 1వ తేదీతో లీజు గడువు ముగుస్తుంది. 2013లో ఈ మైనింగ్ తవ్వకాలకు మైదుకూరు నియోజకవర్గం బి.మఠం అధికార పార్టీ వైసీపీ నాయకుడు నాగేశ్వరరెడ్డికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ఇచ్చారు. ప్రస్తుతం ఆయనే ఈ గనులను నిర్వహిస్తున్నారు. వాస్తవంగా 2019 జనవరి 16, అక్టోబరు 19న రెండు పర్యాయాలు కడప గనులు, భూగర్భ శాఖాధికారులు తనిఖీలు చేశారు. మైనింగ్ రూల్స్ అతిక్రమిస్తున్నారని, నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని షోకాజ్ నోటీసు ఇచ్చారు. మైనింగ్ నిబంధనలు తు.చ. తప్పకుండా అమలు చేస్తానని జీపీఏ తీసుకున్న నాగేశ్వరరెడ్డి సమాధానమిచ్చారు. అయితే ఎక్కడా ఆయన నిబంధనలు అమలు చేయలేదు. దీంతో కడప అధికారులు ఈ మైనింగ్ లీజ్ను రద్దు చేయాలని నిరుడు సెప్టెంబరు 20న రాష్ట్ర గనులు, భూగర్భ శాఖకు సిఫారసు చేశారు. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కలసపాడు మండల రెవెన్యూ, పోలీసు అధికారులకు లేఖ కూడా రాశారు.
అయితే రాష్ట్రాధికారులు లీజు రద్దు చేయలేదు. స్థానిక మండల రెవెన్యూ, పోలీసు అధికారులూ పట్టించుకోలేదు. ఫలితంగా నిబంధనలకు పాతరేసి మైనింగ్ సాగిస్తున్నారు. కనీస అనుమతులు కూడా లేకుండా పేలుడు పదార్థాల నిల్వ, రవాణా చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘోర దుర్ఘటన జరిగి పది మంది మృత్యుఒడికి చేరాక జిల్లా యంత్రాంగం మేల్కొంది. మైనింగ్లో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలపై కలెక్టర్ హరికిరణ్ రాత్రికి రాత్రే నివేదిక పంపారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లె నుంచి ప్రమాదం జరిగిన మామిళ్లపల్లి ముగ్గురాళ్ల భూగర్భ మైనింగ్ వరకు ఏమాత్రం భద్రత లేని వాహనంలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ వంటి పేలుడు సామాగ్రిని ఎలా రవాణా చేశారు.. వేంపల్లెలో నిల్వ చేసిన వ్యక్తికి ఎక్స్ప్లోజివ్ లైసెన్సులు ఉన్నాయా తదితర అంశాలపై తాజాగా దర్యాప్తు సాగిస్తున్నారు.
ఐదుగురిపై కేసు నమోదు
ముగ్గురాళ్ల పేలుళ్ల ఘటనపై ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గనులు, భూగర్భ శాఖ నుంచి మైనింగ్ లీజుకు తీసుకున్న కస్తూరిబాయి.. ఆమె నుంచి మైనింగ్ నిర్వహణ కోసం జీపీఏ పొందిన నాగేశ్వరరెడ్డి, క్షేత్రస్థాయిలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయన సోదరుడు, వేంపల్లె నుంచి ఏమాత్రం భద్రత లేని వాహనంలో పేలుడు పదార్థాలు రవాణా చేసిన వ్యక్తితో పాటు అనుభవం లేని కూలీలను మైనింగ్ కోసం తీసుకొచ్చిన లక్ష్మీరెడ్డిపై కేసులు నమోదు చేశారు. అయితే లక్ష్మీరెడ్డి అదే ప్రమాద ఘటనలో మృతి చెందారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఉన్నత స్థాయి విచారణ: మంత్రి పెద్దిరెడ్డి
మామిళ్లపల్లి పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు గనులు, భూగర్భ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప జాయింట్ కలెక్టర్ గౌతమి ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీసు, మైన్స్, సేఫ్టీ, ఎక్స్ప్లోజివ్స్ శాఖలకు చెందిన అధికారులు విచారణ జరుపుతున్నారని... ఐదు రోజుల్లోగా ఆ కమిటీ నివేదిక అందజేస్తుందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మృతి చెందిన వారి కుటుంబానికి 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు, నష్టపరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు. గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ నేతృత్వంలో ప్రమాద స్థలాన్ని మైనింగ్ అధికారులు పరిశీలించారని, లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, క్వారీ నిర్వహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. చట్ట ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.