ఎన్నికల ప్రచారంపై మమత కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-04-19T21:27:29+05:30 IST

కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తుండటం, పరిస్థితిని చక్కదిద్దవలసి ఉండటంతో ఎన్నికల ప్రచారం..

ఎన్నికల ప్రచారంపై మమత కీలక నిర్ణయం

కోల్‌కతా: కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తుండటం, పరిస్థితిని చక్కదిద్దవలసి ఉండటంతో ఎన్నికల ప్రచారం విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలో మమత ఇక ఎన్నికల ప్రచారం చేయరని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ప్రకటించారు. కోల్‌కతాలో ఎన్నికల ప్రచారం చివరిరోజైన 26వ తేదీన కేవలం ఒక సింబాలిక్ మీటింగ్‌ను మాత్రమే మమత నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దీనితో పాటు, ఇతర జిల్లాల్లో కేవలం 30 నిమిషాలు మించకుండా మాత్రమే ర్యాలీలు నిర్వహించాలని మమత నిర్ణయించినట్టు డెరిక్ ఒబ్రెయిన్ ఒక ట్వీట్‌లో తెలిపారు.


ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత బెనర్జీ సైతం స్వయంగా ఇదే విషయం తెలియజేశారు. ఎన్నికలు జరగాల్సిన చివరి మూడు విడతల్లో భాగంగా కోల్‌కతాలో చిన్న చిన్న మీటింగులను మాత్రమే తమ పార్టీ నిర్వహిస్తుందని, తాను జిల్లాల్లో జరిగే ర్యాలీల్లో స్వల్ప వ్యవధి ప్రసంగాలకే పరిమితం కానున్నానని చెప్పారు. కోవిడ్ పరిస్థితి తీవ్రత దృష్ట్యా తక్కిన మూడు విడతలను ఏకకాలంలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు టీఎంసీ గత వారం విజ్ఞప్తి చేసింది. కోవిడ్ పరిస్థితి దృష్ట్యా పశ్చిమబెంగాల్‌లో తన ప్రచార సభలను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.

Updated Date - 2021-04-19T21:27:29+05:30 IST