ఇది ప్రజా విజయం: మమతా బెనర్జీ
ABN , First Publish Date - 2022-02-14T21:06:38+05:30 IST
పశ్చిమబెంగాల్ మునిస్పిల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేసిన..
కోల్కతా: పశ్చిమబెంగాల్ మునిస్పిల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు వేసిన ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజా విజయంగా అభివర్ణించారు. ప్రజాసేవే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూనే ఉంటుందని అన్నారు. ఈనెల 12వ తేదీన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగగా, ఆ నాలుగింటినీ టీఎంసీ గెలుచుకుని క్లీన్స్వీప్ చేసింది.
పశ్చిమబెంగాల్లోని సిలిగురి, అసాన్ సోల్, బిధాన్నగర్, చందన్ నగర్ మున్సిపాలిటీల్లో లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. బిదాన్నగర్లోని 41 సీట్లలో 39 సీట్లను టీఎంసీ గెలుచుకుంది. విపక్ష బీజేపీ, సీపీఐ ఖాతా కూడా తెరవలేదు. కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకోగా, ఒక వార్డులో సీపీఎం అభ్యర్థి గెలిచారు. చందన్ నగర్లో టీఎంసీ 32 సీట్లకు 31 గెలుచుకుంది. సీపీఎం ఒక వార్డు గెలుచుకుంది. సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ)లో 47 స్థానాల్లో 37 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది. బీజేపీ 5 సీట్లు గెలుచుకోగా, లెఫ్ట్ పార్టీ కేవలం నాలుగు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక సీటు దక్కించుకుంది. అసాన్సోల్లో 106 స్థానాలకు 66 స్థానాల్లో టీఎంసీ గెలుపొందగా, బీజేపీ 5 సీట్లు దక్కించుకుంది, సీపీఎం, కాంగ్రెస్ చెరో రెండు వార్డుల్లో గెలిచాయి.