సకాలంలో నిధులు విడుదల చేయండి
ABN , First Publish Date - 2022-08-06T06:41:50+05:30 IST
కేంద్రం నుంచి పశ్చిమ బెంగాల్కు రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాలని ప్రధాని మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..
ప్రధాని మోదీని కోరిన మమతా బెనర్జీ
న్యూఢిల్లీ, ఆగస్టు 5: కేంద్రం నుంచి పశ్చిమ బెంగాల్కు రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాలని ప్రధాని మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. శుక్రవారం ఆమె ప్రధానితో దాదాపు గంట సేపు సమావేశమై వివిధ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఉపాఽధి హామీ, ఇళ్లు, రోడ్ల నిర్మాణం వంటి పథకాల కింద రూ.17,996.32 కోట్లు నిధులు రావాల్సి ఉందని చెప్పారు. జీఎస్టీ బకాయిలు, ఇతరత్రా నిధులు కలిసి జులై 31 నాటికి మొత్తమ్మీద రూ.1,00,968.44 కోట్లు రావాల్సి ఉందని, వీటిని విడుదల చేయాలని కోరారు.
4 రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ వచ్చిన ఆమె ఆదివారం ప్రధాని అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశఽంలో పాల్గొంటారు. శనివారం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండడం, ఉపాధ్యాయ భర్తీ కుంభకోణంలో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో ప్రధానితో భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. అనంతరం మమత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.