Presidential polls: శరద్ పవార్‌ అభ్యర్థిత్వంపై పట్టువీడని మమత బెనర్జీ

ABN , First Publish Date - 2022-06-15T02:18:58+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించేందుకు న్యూఢిల్లీలో అడుగుపెట్టిన

Presidential polls: శరద్ పవార్‌ అభ్యర్థిత్వంపై పట్టువీడని మమత బెనర్జీ

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించేందుకు న్యూఢిల్లీలో అడుగుపెట్టిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు విముఖంగా ఉన్న మరాఠా యోధుడు శరద్ పవార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గోదాలోకి దించాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. 


శరద్ పవార్‌ను మంగళవారం న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో వామపక్షాల నేతలు సీతారాం ఏచూరి, డీ రాజాతోపాటు మమత బెనర్జీ వేర్వేరుగా కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్తిగా పోటీ చేయాలని కోరారు. అయితే ఆయన అందుకు సున్నితంగా తిరస్కరించారని సీతారాం ఏచూరి తెలిపారు. ఇతర అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 


మమత బెనర్జీ బుధవారం న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బీజేపీయేతర పార్టీల నేతలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి సహా 22 మంది నేతలను ఆహ్వానించారు. శరద్ పవార్‌తో మంగళవారం మమత బెనర్జీ సమావేశమైనపుడు కూడా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని శరద్ పవార్ చెప్పినట్లు సమాచారం. అయితే మమత బెనర్జీ మాత్రం పట్టువీడకుండా బుధవారం జరిగే సమావేశంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ పేరును ప్రతిపాదించబోతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


బుధవారంనాటి సమావేశానికి శరద్ పవార్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. 


రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 15న విడుదలవుతుంది. జూన్ 29 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జూలై 18న పోలింగ్ జరుగుతుంది. జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


Updated Date - 2022-06-15T02:18:58+05:30 IST