నన్ను చంపితే మీకు సంతోషమేనా : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2022-06-10T02:13:33+05:30 IST

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు

నన్ను చంపితే మీకు సంతోషమేనా : మమత బెనర్జీ

కోల్‌కతా : మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు హౌరా వద్ద హైవేను దిగ్బంధించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను చంపితే మీరు సంతోషంగా ఉంటారా?’’ అని నిరసనకారులను ప్రశ్నించారు. ఈ ప్రాంతంలోని క్లబ్బులు, పోలీసులు, ఇమామ్‌లు జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలు దేశ, విదేశాల్లో ముస్లింలకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హౌరాలోని అంకుర్హటి వద్ద జాతీయ రహదారిని కొందరు దిగ్బంధనం చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. డోమ్జుర్ పోలీసులు ఈ నిరసనకారుల వద్దకు వెళ్ళలేకపోయారు. వేలాది మంది గంటలకొద్దీ ఈ రహదారిపై చిక్కుకున్నారు. 


మమత బెనర్జీ నబన్నలో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రోడ్లను దిగ్బంధనం చేసే రాజకీయాలకు దూరమవాలని నిరసనకారులను కోరారు. మైనారిటీలపై దాడి జరిగితే, మెజారిటీలు నిరసన తెలపాలని, మెజారిటీలపై దాడి జరిగితే మైనారిటీలు నిరసన తెలపాలని తాను ఎప్పుడూ చెప్తూ ఉంటానన్నారు. తమ పార్టీ (టీఎంసీ)కి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ ఓటు వేశారన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, రోడ్డు దిగ్బంధనాన్ని విరమించుకోవాలని నిరసనకారులను కోరారు.  ‘‘నన్ను చంపితే మీకు సంతోషం కలుగుతుందా?’’ అని నిరసనకారులను ప్రశ్నించారు. తాను శాంతి, సామరస్యాలు, సంఘీభావానికి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. ఐక్యతను కాపాడటం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. 


Updated Date - 2022-06-10T02:13:33+05:30 IST