ఆ రెండు పార్టీలను బీజేపీ వాడుకుంటోంది : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2021-04-03T20:45:48+05:30 IST

భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని పశ్చిమ

ఆ రెండు పార్టీలను బీజేపీ వాడుకుంటోంది : మమత బెనర్జీ

కోల్‌కతా : భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆరోపించారు. హిందూ, ముస్లింలను విభజించడానికి ఏఐఎంఐఎం, ఐఎస్ఎఫ్ పార్టీలను బీజేపీ వాడుకుంటోందని దుయ్యబట్టారు. దక్షిణ 24 పరగణాలలో రాయిడిఘి స్టేడియంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. 


హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ‘హరే కృష్ణ హరే హరే, తృణమూల్ ఘరే ఘరే’ అంటున్నారని, కానీ బీజేపీవారు మాత్రం ‘హరే కృష్ణ హరే హరే, హిందూ, ముస్లిం భాగ్ కరే, షెడ్యూల్డు క్యాస్ట్స్ కో భాగ్ కరే’ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీవారు బెంగాల్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువులు, ముస్లింలు కలిసి టీ తాగడం, కలిసిమెలిసి దుర్గా పూజ చేయడం మన సంస్కృతి అని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని గ్రామాల్లో అశాంతి నెలకొంటే, దాని వల్ల బీజేపీ లబ్ధి పొందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం, ఐఎస్ఎఫ్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. హిందూ, ముస్లింలను విభజించడానికి ఈ రెండు పార్టీలకు బీజేపీ డబ్బులిచ్చిందని ఆరోపించారు. ‘‘మీరు వేరుపడాలని కోరుకోకపోతే, మీరు ఎన్ఆర్‌సీని కోరుకోకపోతే, ఆ పార్టీలకు ఓటు వేయకండి’’ అని మమత చెప్పారు. 


ఆ పార్టీలకు ఓటు వేయడమంటే బీజేపీకి వేసినట్లేనని చెప్పారు. బాలికలు, పిల్లలు కిడ్నాప్ అవుతారని వాళ్ళు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బయటివారైన బీజేపీ గూండాలకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. 


పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ఏప్రిల్ 6న జరుగుతుంది. ఎనిమిదో, చివరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే రెండున జరుగుతుంది. 


Updated Date - 2021-04-03T20:45:48+05:30 IST