నాకెందుకు వ్యాక్సిన్.. యువతకివ్వండి: మల్లికార్జున్ ఖర్గే
ABN , First Publish Date - 2021-03-01T20:51:29+05:30 IST
కరోనా వ్యాక్సిన్ తనకు ఇచ్చి లాభం ఏమీ ఉండదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తన వంతు వ్యాక్సిన్ను కూడా యువతకు అందిస్తే మంచి జరుగుతుందని ..
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తనకు ఇచ్చి లాభం ఏమీ ఉండదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తన వంతు వ్యాక్సిన్ను కూడా యువతకు అందిస్తే మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయనకు ‘మీరు వ్యాక్సిన్ తీసుకుంటారా..?’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా ఆయన.. తన వయసు 70 సంవత్సరాలని, తనకు వ్యాక్సిన్ ఇచ్చినా ప్రయోజనం అంతగా ఉండదని, తనకంటే యువతకు వ్యాక్సిన్ ఇస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ‘నా వయసు 70 దాటింది. నాకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ను యువతకు ఇవ్వండి. వాళ్ల జీవితం చాలా ఉంది. నా జీవితం మహా అయితే మరో 10-15 ఏళ్లు మాత్రమే ఉంటుంది. కానీ యువతకు ఎంతో జీవితం ఉంది’ అంటూ ఖర్గే పేర్కొన్నారు.