‘మలిదేవి’లో వరద ప్రవాహం
ABN , First Publish Date - 2021-12-03T04:26:12+05:30 IST
బుచ్చిలోని కనిగిరి రిజర్వాయర్ నుంచి మలిదేవి కాలువకు 1500 క్యూసెక్కుల మేర వరద నీరు వదిలిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై గ్రామస్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రమాదాలను తలపిస్తున్న కాశీపాళెం వారధి
బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 2: బుచ్చిలోని కనిగిరి రిజర్వాయర్ నుంచి మలిదేవి కాలువకు 1500 క్యూసెక్కుల మేర వరద నీరు వదిలిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై గ్రామస్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాశీపాళెం వద్ద మలిదేవి కాలువపైన ఉన్న ఓ చిన్నపాటి వారధిపై ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. చిన్నారులూ సైతం ఆ కాలువపైనే తిరుగుతుంటారు. కనీసం ఎవరైనా ప్రమాదానికి గురైతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం వరద నీరు వారధికి దగ్గరగా ఉధృతంగా పారుతుండడంతో మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు వారధిపై నుంచి పడి కాలువలో కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. అతని పరిస్థితి తెలియాల్సి ఉంది. కాగా మలిదేవి కాలువకు నీళ్లు వదలిన అధికారులు స్థానికంగా దండోరా వేసి, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం లేదా అంటూ బీజేపీ మండల నాయకుడు కాసా శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎవరైనా ప్రమాదాలకు గురైతే అధికారులే బాధ్యత వహించడంతో పాటు ప్రజల ఆగ్రహం చవిచూస్తారని హెచ్చరించారు.