సూర్య,చంద్ర ప్రభలపై మెరిసిన మలయప్ప

ABN , First Publish Date - 2020-10-23T10:53:59+05:30 IST

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి గురువారం సూర్యప్రభ,చంద్రప్రభ వాహనంపై కొలువుదీరారు.

సూర్య,చంద్ర ప్రభలపై మెరిసిన మలయప్ప

నేటితో ముగియనున్న వాహన సేవలు 

రేపటి చక్రస్నానంతో బ్రహ్మోత్సవాల ముగింపు


తిరుమల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  మలయప్పస్వామి గురువారం సూర్యప్రభ,చంద్రప్రభ వాహనంపై కొలువుదీరారు. కరోనా ప్రభావంతో వాహనాలన్నీ ఆలయంలోకి తీసుకెళ్లి ఏకాంతంగా సేవలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ బరువు, పరిమాణం కలిగిన బంగారు సూర్యప్రభ వాహనాన్ని లోనికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో దాదాపు 30 ఏళ్ల క్రితం వరకు వినియోగించిన వెండి సూర్యప్రభ వాహనాన్నే తిరిగి వినియోగించారు.ఉదయం 9 గంటలకు ఆలయంలో రంగనాయక మండపంలో మలయప్పస్వామికి త్రివిక్రమ అలంకారం చేసి పక్కనే ఉన్న కల్యాణోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉంచిన వెండి సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి దివ్యప్రబంధం, వేదపారాయణం నిర్వహించారు. అలాగే నైవేద్యాలు సమర్పించి వైదిక కార్యక్రమాలు పూర్తిచేశారు. 


అలాగే రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై గోవిందుడు కటాక్షించాడు. రంగనాయక మండపంలో అలంకార భట్టాచార్యులు, అర్చకులు ఉత్సవమూర్తిని నవనీత కృష్ణుడి రూపంలో అలంకరించి కల్యాణోత్సవ మండపంలో చంద్రప్రభవాహనంపై వేంచేపు చేశారు. వాహన వైదిక కార్యక్రమాలు నిర్వహించి తిరిగి రంగనాయక మండపానికి తీసుకువచ్చారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు.శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమరనాథ్‌ గౌడ్‌, జీయర్‌ స్వాములు, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎనిమిదవ రోజైన శుక్రవారం మలయప్పస్వామి ఉదయం 8 గంటలకు స్వర్ణ రథోత్సవ స్థానంలో సర్వభూపాలవాహనంపై, రాత్రి అశ్వవాహనంపై దర్శనమివ్వనున్నారు.దీంతో వాహనసేవలు  ముగుస్తాయి. శనివారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరు మంజనం నిర్వహించి ఆలయంలో ఇటీ వల నిర్మించిన మినీ పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ముగు స్తాయి.

Updated Date - 2020-10-23T10:53:59+05:30 IST