సర్వభూపాల వాహనంపై మలయప్ప
ABN , First Publish Date - 2020-09-27T08:50:03+05:30 IST
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సూర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు...
- రథోత్సవానికి బదులుగా నిర్వహణ
- నేడు ఆలయంలోనే చక్రస్నానం
- ధ్వజావరోహణతో బ్రహ్మోత్సవాలు పూర్తి
తిరుమల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సూర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. సాధారణంగా 8వ రోజు ఉదయం మాడవీధుల్లో అత్యంత విశిష్ఠమైన మహారథోత్సవం నిర్వహించాల్సి ఉంది. అయితే కొవిడ్ కారణంగా రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని రథం రూపంలో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే రాత్రి చివరి వాహనసేవ అయిన అశ్వవాహనంపై శ్రీవారు క్షటాక్షించారు. ఆదివారం ఉదయం ఆలయంలోనే చక్రస్నానం నిర్వహించనున్నారు. రాత్రికి ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
తిరుమలేశుడి సేవలో 18,296 మంది భక్తులు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం రికార్డుస్థాయిలో 18,296 మంది భక్తులు దర్శించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మార్చి 21 నుంచి జూన్ ఏడో తేదీ వరకు శ్రీవారి దర్శనాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో జూన్ ఎనిమిదో తేదీ నుంచి దర్శనాలను తిరిగి ప్రారంభించారు. తొలుత రోజుకు ఆరువేల మందికే శ్రీవారి దర్శనం చేయించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. క్రమంగా సంఖ్యను పెంచుతూ వచ్చింది. దర్శనాలు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 15వేలలోపే భక్తులు వస్తున్నారు. శనివారం మా త్రం రికార్డు స్థాయిలో భక్తుల సంఖ్య 18,296 మందికి చేరుకుంది.