మలేరియా 16 మందికేనా?

ABN , First Publish Date - 2022-09-28T06:08:09+05:30 IST

‘ఏమిటి జిల్లాలో ఇప్పటివరకు నమోదైన మలేరియా కేసులు 16 మాత్రమేనా! చాలా మండలాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదా? డెంగీ కేసులు 74 మాత్రమేనా.. ఎవరిని ఏమార్చడానికి ఈ కాకి లెక్కలు..’ అంటూ పలువురు ఎమ్మెల్యేలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను నిలదీశారు.

మలేరియా 16 మందికేనా?
సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

ఎవరిని ఏమార్చడానికి ఈ కాకి లెక్కలు

గణాంకాలపై డీఆర్సీలో ఎమ్మెల్యేల ఆగ్రహం

గుంటూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘ఏమిటి జిల్లాలో ఇప్పటివరకు నమోదైన మలేరియా కేసులు 16 మాత్రమేనా! చాలా మండలాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదా? డెంగీ కేసులు  74 మాత్రమేనా.. ఎవరిని ఏమార్చడానికి ఈ కాకి లెక్కలు..’ అంటూ పలువురు ఎమ్మెల్యేలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను నిలదీశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా సమీక్ష మండలి సమావేశం ఇన్‌చార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఒకపక్క ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వందల, వేల సంఖ్యలో ప్రజలు చికిత్సలు తీసుకొంటుంటే ఇలా తక్కువగా కేసులు ఎందుకు చూపిస్తోన్నారని ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి కూడా ఏకీభవిస్తూ సమాచారం వాస్తవికతకు దగ్గరగా ఉండాలని, మరోసారి ఇలా చేయొద్దని మందలించారు. మంత్రి మాట్లాడుతూ గుంటూరు చానల్‌ విస్తరణ, ఆధునికీకరణకు రూ.113 కోట్లు విడుదల చేశామన్నారు. డిసెంబరులో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో ఇళ్ల ప్రారంభోత్సవాలకు చర్యలు చేపట్టామన్నారు.  తాడికొండ, కాకుమానులోని గురుకుల పాఠశాలల్లో నీటి సమస్య పరిష్కరించడానికి రూ.25 లక్షలు మంజూరు చేశామన్నారు.    తెనాలిలో ఇళ్ల పథకం లేఅవుట్లలో బుసక సరఫరాపై మైనింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.  ప్రాథమిక సహకార సంఘాల్లో కుంభకోణం జరిగిందని వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తోన్నారని  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గత ఏడాది  తెగుళ్లతో నష్టపోయిన మిర్చి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. జిల్లాలో నూతన వరి వంగడాలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని శాసనమండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. కొర్నెపాడులోని జగనన్న లేఅవుట్‌లో ఇళ్ల పట్టాలు ఇచ్చారే తప్ప హద్దులు చూపించలేదని ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్‌ తెలిపారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మురుగుడు హన్మంతరావు, జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మహమ్మద్‌ ముస్తఫా, అన్నాబత్తుని శివకుమార్‌, డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి, జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టీనా, నగరపాలక సంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధిమీనా, జీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, డీసీఎంఎస్‌ చైర్‌ఫర్సన్‌ భాగ్యలక్ష్మి, డీఆర్‌వో చంద్రశేఖర్‌రావు, జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీవో ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఈవో శైలజ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T06:08:09+05:30 IST