మలేరియా తగ్గుతోంది!
ABN , First Publish Date - 2022-06-24T20:36:20+05:30 IST
భారత్లో మలేరియా కేసుల సంఖ్య 2015 తర్వాతి నుంచి 86శాతం మేర తగ్గిందని మలేరియా నో మోర్ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా
2015 తర్వాత 86% తగ్గిన కేసులు
79% తగ్గిన మలేరియా మరణాలు
న్యూఢిల్లీ, జూన్ 22: భారత్లో మలేరియా కేసుల సంఖ్య 2015 తర్వాతి నుంచి 86శాతం మేర తగ్గిందని మలేరియా నో మోర్ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా వెల్లడించింది. అదే విధంగా.. 2015-2021 మధ్యకాలంలో మలేరియా సంబంధిత మరణాలు 79శాతం మేర తగ్గాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఇండియాస్ మార్చ్ టువార్డ్స్ మలేరియా ఎలిమినేషన్’ అనే నివేదికను తాజాగా విడుదల చేసింది. 2017-18 మధ్యలో మలేరియాకు కేటాయించిన నిధులను భారత్ సర్కారు రెండింతల కంటే ఎక్కువ చేసిందని ఆ నివేదికలో తెలిపింది. ‘‘పురుగులను అడ్డుకునేందుకు ప్రభుత్వం 9 కోట్ల తెరలను సమకూర్చింది. 2030కల్లా దేశం నుంచి మలేరియాను పారద్రోలాలనేది కేంద్రం లక్ష్యం. అయితే.. దీన్ని ప్రభుత్వం సొంతంగా సాధించలేదు. ప్రైవేటు రంగం భాగస్వామ్యం, వ్యక్తులు, సంఘాలు సంయుక్తంగా ఈ రోగంపై పోరాటంలో సహాయం అందించాలి’’ అని పేర్కొంది. కాగా.. మలేరియాను ఎంతగా నిరోధించినా మళ్లీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందని మలేరియా నో మోర్ డైరెక్టర్ ప్రతీక్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.