వామ్మో.. అంటువ్యాధులు

ABN , First Publish Date - 2020-07-09T11:58:50+05:30 IST

వర్షాకాలం ఆరంభమైంది.. జిల్లాలో నాలుగురోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

వామ్మో.. అంటువ్యాధులు

జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు నమోదు 

 వ్యాధుల నివారణకు జిల్లా, గ్రామస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు?

ప్రత్యేక సెల్‌ ఏర్పాటుకు అధికారుల కసరత్తు


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): వర్షాకాలం ఆరంభమైంది.. జిల్లాలో నాలుగురోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. గుంతల్లోకి వర్షపు నీరు చేరింది. మురుగు కాలువలు, వరదనీటితో పొంగి ప్రవహించాయి. పరిసర ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కావడం, గుంతల్లో నీరునిల్వ ఉండటంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో జిల్లా ప్రజలు సతమతమవుతున్నారు.


 జిల్లాలో ఇప్పటివరకు 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దగ్గు, తుమ్ములు, గొంతునొప్పి, జ్వరం వంటివి ఉంటే కరోనా లక్షణాలుగా అనుమానిస్తున్నారు. ఈ వర్షాలతో వైరల్‌ఫీవర్లు, మలేరియా, డెంగీ, కలరా, పచ్చకామెర్లు, అతిసార వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అయితే ఏ చిన్న జబ్బు వచ్చినప్పటికీ కరోనా అనే భయంతో జనం పరీక్షలు చేయించుకునేందుకు కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే మలేరియా కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే వ్యాధులకు దూరంగా ఉంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అంటువ్యాధులను అరికట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ జిల్లా, గ్రామస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ వారంలో దీనిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు.


జిల్లాస్థాయి కమిటీలో డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌, జడ్పీ సీఈవో, డీపీవో, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా గ్రామస్థాయి కమిటీల్లో ఆశావర్కర్‌, అంగన్‌వాడీ కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వీరు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే కాలనీలను గుర్తించి పీహెచ్‌సీలకు సమాచారం అందిస్తారు. అవసరమైన ప్రాథమిక చికిత్సలు చేస్తారు. వ్యాధుల నివారణ కోసం జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్సు కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. అంటువ్యాధులకు సంబంధించి జిల్లాలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. 


వైద్యశాఖ అప్రమత్తం 

వర్షాలు కురుస్తుండటంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు మలేరియా కేసులు, దాదాపుగా 75 డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని మల్కాజ్‌గిరి, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, కాప్రా, తదితర మండలాల్లో మలేరియా, డెంగీ వ్యాప్తి చెందాయి. ఇటీవల మల్లాపూర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో మలేరియా కేసులు నమోదు కావడంతో అధికారులు శాంపిల్స్‌ను సేకరించారు. ప్రజలకు అంటువ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. వాడవాడల్లో యాంటీ లార్వల్‌ ఆపరేషన్‌(ఏఎల్‌ఓ) చేపడుతున్నారు. వర్షాల కారణంగా గుంతల్లో నీరు చేరి, దోమలు వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో క్రూడ్‌ఆయిల్‌, ఇంజిన్‌ ఆయిల్‌ను నాలాల్లో, మురికికాలువల్లో వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైద్యులు, ఆశావర్కర్లు అప్రమత్తంగా ఉండాలని శాఖ అధికారి ఆదేశాలు జారీచేశారు.  


జాగ్రత్తలు పాటించాలి : వైద్యులు

మలేరియా, చికున్‌గున్యా, డెంగీ జ్వరం దోమల వల్లే వ్యాపిస్తుంది. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అప్రమత్తంగా ఉంటే రోగాలు దరి చేరవని చెబుతున్నారు.

Updated Date - 2020-07-09T11:58:50+05:30 IST