మల్లన్న జాతరకు వెళ్లొద్దామా..
ABN , First Publish Date - 2022-01-13T04:46:47+05:30 IST
మల్లన్న జాతరకు వెళ్లొద్దామా..
ముస్తాబైన ఐనవోలు దేవస్థానం
నేడు ధ్వజారోహణం.. రేపు భోగి..
15న సంక్రాంతి రోజున ప్రధాన జాతర
ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం
జాతరకు తరలివస్తున్న భక్తులు
ఐనవోలు, జనవరి 12: రాష్ట్ర కూటులు.. కళ్యాని చాళుక్యులు.. కాకతీయులు.. ఏ రాజుల చరిత్రను పరిశీలించినా.. వారంతా ఐనవోలు మల్లికార్జునస్వామి భక్తులేనని చారిత్రక ఆనవాళ్లు, శిలా శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన ఐలోని జాతరను పురస్కరించుకొని మల్లన్న సన్నిధికి తరలిరావాలని భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 13న (గురువారం) ధ్వజారోహన కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతుండటం ఈ ఆలయ విశిష్టత. 14న భోగి పర్వదినం, 15న మకర సంక్రాంతి రోజున వివిధ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు జాతర నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.
వైద్య సేవలు : ఐనవోలు పీహెచ్సీ ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యులు, వైద్య సిబ్బంది షిఫ్టుల వారీగా నిరంతరం అందుబాటులో ఉండి 24 గంటలు వైద్యసేవలు అందించనున్నారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు వ్యాక్సినేషన్ చేయనున్నారు. 108 వాహనం అందుబాటులో ఉండనుంది.
విద్యుత్ సరఫరా : జాతరలో విద్యుత్ సరఫరా కోసం 315 కేవీఏ సామర్ధ్యం గల ఒక ట్రాన్స్ఫార్మర్తో పాటు ప్రత్యేకంగా 100కేవీ 5, గ్రామానికి 3 ట్రాన్స్ఫార్మర్లు బిగించారు. జాతరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా సబ్స్టేషన్ నుంచి ప్రత్యేక ఫీడర్ను ఏర్పాటు చేశారు.
విద్యుత్కాంతులు : జాతరలో విద్యుత్కాంతుల కోసం ఈసారి అదనంగా ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టూ 70 స్తంభాల ద్వారా 140 ఎల్ఈడీ ల్యాంప్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రాంగణంలో 500 హైలోజన్ లైట్లు, 300 ఎల్ఈడీ, 150 డేల్యాం్ప్ ఫోకస్ లైట్లు, 2లక్షల సీరియల్ బల్బ్లు అమర్చారు.
పారిశుధ్య నిర్వహణ : పారిశుధ్య నిర్వహణకు 200మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 100 మంది గ్రేటర్ నుంచి, 50 మంది పంచాయతీరాజ్ శాఖ గ్రామపంచాయతీల నుంచి, 50 మంది ఆలయం నుంచి ఏర్పాటు చేశారు. చెత్తను బయటపడేయకుండా పలుచోట్ల కుండీలను ఏర్పాటు చేశారు.
పోలీస్ సేవలు : పోలీసులు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా బందోబస్తును పర్యవేక్షించనున్నారు. జాతర పార్కింగ్ స్థలాలను ఖరారు చేసి రూట్మ్యాప్ విడుదల చేశారు. ప్రధాన రోడ్లపై చెక్పోస్టులను సిద్ధం చేశారు. 100 సీసీ కెమెరాలు, ప్రత్యేక గస్తీ, నిఘా బృందాలు, షీటీంలు పనిచేయనున్నాయి. మామునూరు ఏసీపీ నరే్షకుమార్, పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్, ఎస్సై ఎం.భరత్ల నేతృత్వలో సుమారు 312 మంది పోలీసులు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి విధుల్లో చేరారు.
ఆర్టీసీ బస్సులు : హనుమకొండ, తొర్రూరు, జనగామ డిపోలకు చెందిన ప్రత్యేక బస్సుల ద్వారా జాతరకు భక్తులను చేర్చనున్నారు. వరంగల్ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఐనవోలుకు బయలుదేరుతుంది. కాజీపేట నుంచి బస్సులను ఏర్పాటు చేశారు. ఐనవోలు-కొమురవెళ్లి-వేములవాడలకు భక్తులు వెళ్లే విధంగా రూట్మ్యాప్ సిద్ధం చేశారు.
ఉద్యోగుల విధులు : జాతరలో మూడు రోజుల పాటు ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో వెంకటరమణల నేతృత్వంలో ఆర్ఐలు,వీఆర్ఏలు పంచాయతీ కార్యదర్శులు,సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.