మక్కల కొనుగోలులో నిబంధనలు సడలించాలి
ABN , First Publish Date - 2020-12-02T04:31:09+05:30 IST
మక్కల కొనుగోలులో నిబంధనలు సడలించాలి
- కొనుగోలు కేంద్రం, వ్యవసాయ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన
మర్పల్లి: నిబంధనలు లేకుండా మక్కలను కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు వంద మంది మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రం, వ్యవసాయం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆన్లైన్లో నమోదైన రైతుల పంటను మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు సూచించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి మక్కలను కొనుగోలు చేయాలని వారు భీష్మించారు. అనంతరం వ్యవసాయ కార్యాలయానికి చేరుకుని తాము మొక్కజొన్న పంట వేసినా ఎందుకు నమోదు చేయలేదని ఏఈవోలను ప్రశ్నించారు. మక్కలను కొనుగోలు చేయకపోతే పంటను ఇక్కడే తగలబెడతామని ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రతీ రైతు పంట కొనుగోలు చేసేలా చూస్తామని పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సమాధానం ఇవ్వడంతో శాంతించారు. ఈ నెల 3వ తేదీన షరతులు లేకుండా పంటను కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మర్పల్లి మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేసి ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు.