‘మున్సిపాలిటీని అగ్రగామిగా తీర్చిదిద్దుతాం’
ABN , First Publish Date - 2020-05-23T10:19:15+05:30 IST
వచ్చే నాలుగేళ్లలో ఆదిలాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
ఆదిలాబాద్టౌన్, మే 22: వచ్చే నాలుగేళ్లలో ఆదిలాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన టెలీకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో సమావేశాలు, సదస్సులు నిర్వహించరాదని, వచ్చే ఏడాదికి సంబంధించిన మున్సిపల్ బడ్జెట్ను రాష్ట్ర మున్సిపల్ అధికారులకు పంపించేందుకు అత్యవస రంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు.
మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఎజెండాలోని అంశాలను సభ్యులకు ఫోన్లో చదివి వినిపించారు. అనంతరం వారి నుంచి బడ్జెట్కు అవసరమైన ఆమోదాన్ని పొందారు. ఈ బడ్జెట్ను కలెక్టర్ ద్వారా మున్సిపల్ అధికారుల అనుమతి కోసం పంపనున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.66.48 కోట్లు కాగా అంచనా వ్యయం రూ.65.85 కోట్లుగా అధికారులు తెలుపగా వాటన్నింటికీ సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం తప్పని సరిగా వెనకబడిన తరగతులు, మైనార్టీలు, మురికి వాడలు, విలీనమైన కాలనీల అభివృద్ధికి గాను అంచనా బడ్జెట్లో రూ.44.13లక్షలు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో వసతుల కల్పనకు రూ.12లక్షలు, వైకుంఠధామాల నిర్మాణాల కోసం రూ.3లక్షలు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం, నిర్వహణ కోసం రూ.10లక్షలు, వెజ్, నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాటు కోసం రూ.5లక్షలు, జంగు వదశాల నిర్మాణం కోసం రూ.3.44లక్షలు, డంపింగ్యార్డులో శాస్ర్తీయ పద్ధతిలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం రూ.4లక్షలు, వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు రూ.50.97లక్షలు కేటాయించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, వైస్ చైర్మన్ జహీర్రంజాని, ఫ్లోర్లీడర్ బండారు సతీష్, అసిస్టెంట్ కమిషనర్ రాజు తదితరులున్నారు.