రాహుల్గాంధీ పాదయాత్రను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2022-08-12T04:46:56+05:30 IST
అధికార బీజేపీ అవలంభిస్తున్న విభజన వాదాన్ని వ్యతిరేకిస్తూ తమ నేత రాహుల్గాంధీ చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి
పీలేరు, ఆగస్టు 11: అధికార బీజేపీ అవలంభిస్తున్న విభజన వాదాన్ని వ్యతిరేకిస్తూ తమ నేత రాహుల్గాంధీ చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీలేరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అటు ప్రజలు, ఇటు రాష్ట్రాల మధ్య విభజనవాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు ఏర్పడిందన్నారు. దేశ ప్రజల హృదయాల్లో బీజేపీ నాటిన విభజన, విద్వేష భావాలను తొలగించి జాతీయ భావాన్ని జాగృతం చేసేందుకు తమ నేత రాహుల్గాంధీ సెప్టెంబరు 7వ తేదీ నుంచి పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 3 వేల కిలోమీటర్లు, 12 రాష్ట్రాల గుండా పాదయాత్ర సాగుతుందన్నారు. అందులో భాగంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దాదాపు 100 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందన్నారు. దేశ ప్రజలు రాహుల్గాంధీ పాదయాత్రను విజయవంతం చేసి బీజేపీ పట్ల తమకున్న వ్యతిరేకతను, దేశం పట్ల ఉన్న జాతీయ భావాన్ని చాటాలని కోరారు. కార్యక్రమంలో పీలేరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆఘామొహియుద్దీన్, నాయకులు అత్తార్ చాన్బాషా, జకీయుద్దీన్, సలావుద్దీన్, నాగరాజు, మహబూబ్బాషా, రహంతుల్లా, అమర్, ఉత్తన్న, కళ్యాణ్, శివ, తదితరులు పాల్గొన్నారు.