వికారాబాద్‌ పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి

ABN , First Publish Date - 2021-09-18T04:32:30+05:30 IST

వికారాబాద్‌ పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి

వికారాబాద్‌ పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

  •   సమీక్ష సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి

వికారాబాద్‌ , సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రమైన వికారాబాద్‌ పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో వికారాబాద్‌ మునిసిపాలిటీ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజులారమేష్‌, కమిషనర్‌ శరత్‌చంద్ర, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ ప్రభాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వికారాబాద్‌ మునిసిపాలిటీగా, జిల్లా కేంద్రంగా మారినందున ఆస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. టీయూఎ్‌ఫఐడీసీలో భాగంగా ఈ మునిసిపాలిటీకి రూ.6 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆమె సమీక్షించారు. అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. పట్టణ కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న డంపింగ్‌ యార్డుకు అదనంగా మరో డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు అనువైన స్థలం గుర్తించాలని ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వైకుంఠధామాలకు రూ.2 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు రూ.4 కోట్లు మంజూరు చేశామని, ఈ పనులు త్వరగా చేపట్టాలని ఆమె ఆదేశించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా సెంట్రల్‌ లైటింగ్‌ పోల్స్‌కు రోప్‌ లైటింగ్‌, శివసాగర్‌ చెరువువద్ద బతుకమ్మ ఘాట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధ్దీకరణలో భాగంగా చిన్న, వీధి వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్దేశించిన చోట నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Updated Date - 2021-09-18T04:32:30+05:30 IST