ఇదేం పని?

ABN , First Publish Date - 2020-05-22T10:55:07+05:30 IST

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు..

ఇదేం పని?

జలుమూరు(శ్రీకాకుళం): మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు. మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రైతులు ఎంతగానో సంతోషించారు. కానీ ప్రక్రియ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలను రైతుల వద్దే విడిచిపెట్టారు. బిల్లులు సైతం చెల్లించకపోవడంతో అసలు సరుకు కొనుగోలు చేసినట్టా లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల వద్ద వదిలేసిన బస్తాలను సంరక్షించలేక ఇబ్బందిపడుతున్నారు.


తక్షణం బిల్లులు చెల్లించి మొక్కజొన్న బస్తాలు తీసుకెళ్లాలని నగిరికటకం గ్రామానికి చెందిన బగ్గు బుచ్చయ్య, యిప్పిలి అప్పారావు, రావాడ శిమ్మన్న, సూర్యనారాయణ తదితర రైతులు కోరుతున్నారు. దీనిపై చల్లవానిపేట సొసైటీ సీఈవో సత్యారావును వివరణ కోరగా ఇప్పటికే 8 వేల బస్తాలను కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్‌కు తరలించినట్టు చెప్పారు. మరో 10 వేల బస్తాలు తరలించేందుకు మార్క్‌ఫెడ్‌ నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. వచ్చిన వెంటనే తరలిస్తామని చెప్పారు.

Updated Date - 2020-05-22T10:55:07+05:30 IST