నవ్విపోదురుగాక..: చైనా వ్యవహారంపై ఆనంద్ మహీంద్ర కౌంటర్!

ABN , First Publish Date - 2020-05-26T23:29:12+05:30 IST

కొవిడ్-19 నేపథ్యంలో భారత్ నుంచి తమ దేశీయులను ఖాళీ చేయిస్తామంటూ చైనా పేర్కొనడంపై...

నవ్విపోదురుగాక..: చైనా వ్యవహారంపై ఆనంద్ మహీంద్ర కౌంటర్!

న్యూఢిల్లీ: కొవిడ్-19కు పుట్టిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా.. ఇప్పుడు భారత్ నుంచి తమ దేశీయులను ఖాళీ చేయిస్తామంటూ పేర్కొనడంపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు. ఇంతకు మించిన ‘‘హాస్యాస్పదం’’ మరోటి లేదంటూ కౌంటర్ విసిరారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా భారత దేశంలో ఉన్న తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చైనా పేర్కొంది. స్వదేశానికి తిరిగి వెళ్లదల్చుకున్న వారు ఈ నెల 27లోగా రిజిస్టర్ చేసుకోవాలంటూ భారత్‌లో చైనా రాయబార కార్యాలయం ఇప్పటికే ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విద్యార్థులు, టూరిస్టులు, వ్యాపారులు సహా మిగతా వారంతా ఈ నెల 27న చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక విమానంలో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఎవరి ప్రయాణ ఖర్చులు వారే భరించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.


ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘హాస్యాస్పదం అనే పదాన్ని ఉపయోగించడానికి ఇంతకు మించిన సందర్భాన్ని నేనెప్పుడూ చూడలేదు...’’ అని వ్యాఖ్యానించారు. కాగా కరోనా పేరుతో డ్రాగన్ దేశం తమ పౌరులను వెనక్కి పిలిపిస్తున్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.



Updated Date - 2020-05-26T23:29:12+05:30 IST