దుబాయిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. పోటెత్తిన భక్తజనం

ABN , First Publish Date - 2020-02-22T00:26:44+05:30 IST

దుబాయి నగరం నడిబొడ్డున ఉన్న బర్ దుబాయిలోని హవేలీ ప్రాంగణం శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా జనసంద్రమైంది. మహాశివుడు దర్శనం కోసం భక్తజనం బారులు తీరారు.

దుబాయిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. పోటెత్తిన భక్తజనం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయి నగరం నడిబొడ్డున ఉన్న బర్ దుబాయిలోని హవేలీ ప్రాంగణం శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా జనసంద్రమైంది. మహాశివుడు దర్శనం కోసం భక్తజనం బారులు తీరారు. దుబాయిలో ఉన్న ఏకైక హిందు ఆలయమైన శివమందిర్ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. శుక్రవారం గల్ఫ్‌లో సెలువు కావడంతో భక్తిశ్రద్ధలతో దర్శనం చేయడానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకోని శివనామ స్మరణలో మునిగిపోయారు. ఆలయానికి అన్ని వైపులా 3కిలో మీటర్ల మేర భక్తులు బారులు తీరారని మందిరంలో ప్రసాద భాద్యతలు చూసే కె. నాగేశర్వరావు చెప్పారు.


దుబాయిలో శివరాత్రి నాడు ఇంతగా భక్తుల తాకిడి గతంలో తానెప్పుడు చూడలేదని ప్రతి శివరాత్రికి పూజలు నిర్వహించే శ్రీరాం వేణురెడ్డి పేర్కొన్నారు. ఎడారి దేశంలో ఈ స్ధాయిలో ఆరాధన, భక్తిభావం ప్రశంసనీయమని కువైత్‌లోని ప్రవాస వ్యాపారి శరత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దుబాయిలో ఒక సమావేశం నిమిత్తం వచ్చిన ఆయన శివమందిరంలో అసంఖ్యాక భక్తులను చూసి ఆశ్చర్యపోయారు. ఇక పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువ తెలుగు ప్రవాసీయులు పూజల కంటె ఎక్కువ సమయం సెల్ఫీలలో గడిపారు. దుబాయిలో ఉన్న ఈ మందిరాన్ని కృష్ణ మందిర్ అని కూడ పిలుస్తారు. సూక్ అల్ బనియాన్ అనే ప్రాంతంలో గుజరాతీ, సింధీ వైశ్యులు తమ ఆరాధాన కొరకు 1958లో ప్రస్తుత రాజు తండ్రి అనుమతితో దీన్ని నెలకోల్పారు. దుబాయిలో గణనీయంగా పెరిగిన భారతీయులకు ఈ మందిరం సరిపోవడం లేదు.

Updated Date - 2020-02-22T00:26:44+05:30 IST