నందిపై ముక్కంటి రాజసం!

ABN , First Publish Date - 2020-02-24T09:30:00+05:30 IST

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం ఉదయం పరమేశ్వరుడు అధికార నందిపై గంగాభవానీతో కలిసి పురవిహారం చేశారు. ఆదిదేవుడి దేవేరి జ్ఞానప్రసూనాంబదేవి కామధేనువుపై అధిష్ఠించి స్వామివారిని

నందిపై ముక్కంటి రాజసం!

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం ఉదయం పరమేశ్వరుడు అధికార నందిపై గంగాభవానీతో కలిసి పురవిహారం చేశారు. ఆదిదేవుడి దేవేరి జ్ఞానప్రసూనాంబదేవి కామధేనువుపై అధిష్ఠించి స్వామివారిని అనుసరించారు. మూషికవాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై శ్రీవళ్లీ, దేవసేన సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప స్వామి అమ్మవార్లను అనుసరించారు. పుర విహారంలో శివపార్వతులకు భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. రాత్రి శ్రీకాళహస్తీశ్వరుడు గంగాదేవితో కలిసి గజవాహనంపై, జ్ఞానప్రసూనాంబదేవి సింహవాహనంపై అధిష్ఠించి పెండ్లిమండపం వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఆదిదంపతులు కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. కాగా మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం ముక్కంటి సన్నిధిలో సభాపతి(నటరాజస్వామి) కల్యాణం నిర్వహించనున్నారు. ముక్కంటి కల్యాణోత్సవం సందర్భంగా ఆదివారం టీటీడీ తరఫున పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శివపార్వతులకు పట్టువస్త్రాలు సమర్పించారు.

Updated Date - 2020-02-24T09:30:00+05:30 IST