డెల్టా ప్లస్ వేరియంట్ ముప్పును ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర ప్లాన్ ఇదే!
ABN , First Publish Date - 2021-06-24T11:00:05+05:30 IST
కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి...
ముంబై: కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ఈ వైరస్కు అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. కరోనా సెకెండ్ వేవ్ను అధిగమించి, అన్లాకింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే రాష్ట్రం మరోసారి ఇబ్బందుల్లో పడింది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్కు సంబంధించి అత్యధికంగా 21 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఈ కేసులను రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కనుగొన్నారు. ఫలితంగా కరోనా థర్డ్ వేవ్ను అరికట్టే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది.
ఇటీవల రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.... ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఒక నివేదిక అందజేసింది. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్కు డెల్టా ప్లస్ వేరియంట్ కారణమని దానిలో పేర్కొంది. తాజాగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే విలేకరులతో మాట్లాడుతూ ఈ వేరియంట్ ప్రభావం అధికంగా ఉండబోతున్నదని అన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా డెల్టా ప్లస్ వేరియంట్పై ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రాలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కాగా మహారాష్ట్రలో కరోనా థర్డ్ వేవ్ నుంచి రక్షణకు కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్ సూత్రాన్ని అమలు చేస్తున్నారు. అయితే, డెల్టా వేరియంట్కు సంబంధించిన పరిశోధనల డేటా అంతగా అందుబాటులో లేదు. ఇంకా ఈ వైరస్ లక్షణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వేరియంట్ కేసులపై మహారాష్ట్ర వైద్యాధికారులు దృష్టి సారించారు.