డెల్టా వేరియంట్‌తో మహారాష్ట్రలో తొలి మరణం..

ABN , First Publish Date - 2021-06-25T21:07:38+05:30 IST

దేశంలో డెల్డా ప్లస్ వేరియంట్ విజృంభించనుందని, థర్డ్ వేవ్‌కు అవకాశాలున్నాయని బలంగా..

డెల్టా వేరియంట్‌తో మహారాష్ట్రలో తొలి మరణం..

ముంబై: దేశంలో డెల్డా ప్లస్ వేరియంట్ విజృంభించనుందని, థర్డ్ వేవ్‌కు అవకాశాలున్నాయని బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఒక వ్యక్తి శుక్రవారంనాడు మరణించాడు. రత్నగిరి జిల్లాలోని సంగమేశ్వర్ ప్రాంతంలో 80 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. డెల్టా ప్లస్ వేరియంట్‌తో మహారాష్ట్రలో సంభవించిన తొలి మరణం ఇదే కావడం విశేషం. అయితే, వయస్సుకు సంబంధించిన సమస్యలు కూడా మృతునికి ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం, మహారాష్ట్రలో ఇంతవరకూ డెల్టా ప్లస్ వేరియంట్‌తో 21 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు మరణించడంతో తక్కిన కేసుల విషయంలో ప్రభుత్వాధికారులు అప్రమత్తమయ్యారు.


కాగా, పొంచి ఉన్న థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని రోజుకు 3,000 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) ఉత్పత్తిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం రాష్ట్ర ఎల్ఎంఓ ఉత్పత్తి 1,300 టన్నులు మాత్రమే ఉంది. ప్రాధాన్యతా క్రమంగా తీసుకుని ఆక్సిజన్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిందిగా ఆక్సిజన్ ఉత్పత్తిదారులను సీఎం కోరారు. థర్డ్ వేవ్ వస్తుందనే అంచనా ఉందని, కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ను కనుగొన్నామని థాకరే చెప్పారు. అయితే, ఏ మేరకు ఈ వైరస్ ప్రాణాంతకమనేది తెలియదనన్నారు. చేతిలో ఉన్న సమయాన్ని ఉపయోగించి తగినంత ఆక్సిజన్ సొంతంగా తయారు చేసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు కాపడటానికి తన తొలి ప్రాధాన్యమని చెప్పారు.

Updated Date - 2021-06-25T21:07:38+05:30 IST