Maharashtra Political Crisis: సుప్రీంకు ‘మహా’ పంచాయతీ.. ఉద్ధవ్ వర్గం బలంగా వినిపించిన వాదన ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-30T00:25:07+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు (Maharashtra Political Crisis) శరవేగంగా మారిపోతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో రేగిన సంక్షోభంలో బీజేపీ కూడా..

Maharashtra Political Crisis: సుప్రీంకు ‘మహా’ పంచాయతీ.. ఉద్ధవ్ వర్గం బలంగా వినిపించిన వాదన ఏంటంటే..

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు (Maharashtra Political Crisis) శరవేగంగా మారిపోతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో రేగిన సంక్షోభంలో బీజేపీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఏక్‌నాథ్ షిండే వర్గం (Eknath Shinde) సంకీర్ణ ప్రభుత్వానికి మద్ధతు ఉప సంహరించుకునే అవకాశం ఉండటంతో ఉద్ధవ్ వర్గం (Uddhav Thackeray) అనర్హత అస్త్రం ప్రయోగించేందుకు ప్రయత్నించింది. అయితే.. అనర్హత నోటీసులపై ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) క్యాంపు సుప్రీం కోర్టుకు (Supreme Court) వెళ్లడంతో అనర్హత నోటీసులపై గడువును అత్యున్నత న్యాయస్థానం జులై 11 వరకూ పొడిగించింది. ఈ ఎపిసోడ్ ఇలా నడుస్తుండగా బీజేపీ (BJP) వ్యూహాత్మకంగా పావులు కదిపింది.



‘మహా’ పరిణామం విషయంలో బీజేపీ వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు బయటకు చెబుతున్నా.. లోలోపల హడావుడి చర్చలు, భేటీలు జరుగుతున్నాయి. ఎంవీఏ సర్కారుకు ఇప్పుడు సంఖ్యా బలం లేనందున పక్కకు తప్పుకోవాలని బీజేపీ సీనియర్‌ నేత సుధీర్‌ ముంగటివార్‌ అన్నారు. అటు.. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) మంగళవారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. మహారాష్ట్రలో (Maharashtra Political Crisis) చోటుచేసుకుంటున్న పరిణామాలను గురించి వివరించారు. ఆ వెంటనే.. అంటే.. రాత్రి 10 గంటల సమయంలో ముంబైకి చేరుకున్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ కోశ్యారీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను బలపరీక్షకు ఆహ్వానించాలని కోరారు. జూన్ 30న తమ బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఆదేశించారు.



గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం (Uddhav Faction) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. మరోపక్క ఉద్ధవ్ అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్ సమావేశమయింది. తాజా పరిణామాలపై మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీరియస్‌గా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. బలపరీక్షపై గవర్నర్ ఆదేశాలను శివసేన చీప్ విప్ సునీల్‌ప్రభు సవాలు చేశారు. సునీల్‌ప్రభు పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. శివసేన (Shivsena) తరపున అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) వాదనలు వినిపిస్తున్నారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత అంశం తేలాకే బలపరీక్షకు అనుమతివ్వాలని ఆయన వాదించారు. బలపరీక్ష గురించి తమకు ఈరోజే సమాచారం అందిందని, బలనిరూపణకు ఒకరోజు మాత్రమే ఇవ్వడం అన్యాయమని సింఘ్వీ కోర్టుకు వాదన వినిపించారు. రెబల్ ఎమ్మెల్యేలను (Rebel MLAs) కాపాడేందుకే తెరపైకి బలపరీక్షను తీసుకొచ్చారని, తమ ఎమ్మెల్యేలు కొంతమంది విదేశాల్లో ఉన్నారని, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని సింఘ్వీ సుప్రీంకు వివరించారు. ఈ పరిస్థితిలో బలపరీక్ష ఎలా నిర్వహిస్తారని సింఘ్వీ ప్రశ్నించారు. బలపరీక్షపై జులై 11న నిర్ణయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టును సింఘ్వీ కోరారు.

Updated Date - 2022-06-30T00:25:07+05:30 IST