Maharashtra Political Crisis: ముదిరిపాకాన పడిన ‘మహా’ సంక్షోభం.. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం

ABN , First Publish Date - 2022-06-27T00:06:29+05:30 IST

మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్షణానికో మలుపు తిరుగుతోంది. పోలీస్ శాఖతో గవర్నర్ చర్చలు జరుపుతుండటంతో..

Maharashtra Political Crisis: ముదిరిపాకాన పడిన ‘మహా’ సంక్షోభం.. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం

ముంబై: మహారాష్ట్రలో (Maharashtra) కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం (Maharashtra Political Crisis) క్షణానికో మలుపు తిరుగుతోంది. పోలీస్ శాఖతో గవర్నర్ చర్చలు జరుపుతుండటంతో రాష్ట్రపతి పాలన (President Rule) విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏక్‌నాథ్ షిండే క్యాంపులో (Eknath Shinde Camp) చేరిన రెబల్ ఎమ్మెల్యేల (Rebel MLAs) సంఖ్య 39కి చేరింది. అనర్హత పిటిషన్లపై (Disqualification Petition) జూన్ 27 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించిన డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) నిర్ణయాన్ని సవాల్ చేయాలని రెబల్స్ నిర్ణయించారు. సుప్రీంకోర్టులో (Supreme Court) ఈ మేరకు సోమవారం పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రెబల్స్ అవిశ్వాస తీర్మానం నోటీసులను డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేశారు. ఈ చర్యలను తిప్పికొట్టేందుకు ఏక్‌నాథ్ షిండే ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు (Shivsena Rebel MLAs) కేంద్రం 'వై ప్లస్' భద్రత కల్పించింది.



విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హా (Yaswanth Sinha) సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆయన స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 



ఇదిలా ఉండగా.. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో మహారాష్ట్రలోని భండారా ఎమ్మెల్యే నరేంద్ర భొండేకర్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే సదరు ఎమ్మెల్యేకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. షిండేతో పాటు ఆయన క్యాంపులోని రెబల్ ఎమ్మెల్యేలంతా ముంబైకి చేరుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.



ఏక్‌నాథ్‌ వేరుకుంపటి తర్వాత ఆయనను శివసేన శాసనసభాపక్ష నేతగా తొలగించి అజయ్‌చౌదరిని నియమించిన విషయం తెలిసిందే. అజయ్‌చౌదరి శనివారం 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌కు లేఖ రాశారు. దీంతో నరహరి 16 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. సోమవారంలోగా లిఖితపూర్వక సమాధానమివ్వాలని ఆదే శించారు. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్‌ నరహరిపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఏక్‌నాథ్‌ సహా.. 34 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు తాము సంతకం చేసిన లేఖను ఈ-మెయిల్‌లో పంపారు. అయితే.. ఆ మెయిల్‌ గుర్తుతెలియని, విశ్వసించలేని సోర్స్‌ నుంచి వచ్చిందని పేర్కొంటూ.. నరహరి అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు. మరోవైపు మహారాష్ట్ర విపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో కేంద్ర మంత్రి రాందాస్‌ ఆఠవాలే భేటీ అయ్యారు. ఇక.. తిరుగుబాటు వర్గీయుల ఇళ్లు, కార్యాలయాలపై శివసైనికులు దాడులకు పాల్పడ్డారు. థానెలోని ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే కార్యాలయంపై దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో.. థానె కలెక్టర్‌ రాజేశ్‌ నర్వెకార్‌ నగరంలో నిషేధాజ్ఞలను విధించారు. బీజేపీ-శివసేన ప్రభుత్వ ఏర్పాటుపై ఏక్‌నాథ్‌ షిండే, ఫడణవీస్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-06-27T00:06:29+05:30 IST