నేటి నుంచి మహానాడు

ABN , First Publish Date - 2020-05-27T08:38:29+05:30 IST

తెలుగుదేశం పార్టీ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ఈ ఏడాది ఆన్‌లైన్‌లో బుధ, గురువారాల్లో జరగనుంది.

నేటి నుంచి మహానాడు

జూ జిల్లా నుంచి 3వేల మందికి పైగా పాల్గొనే అవకాశం 

జూ అంతా ఆన్‌లైన్‌


విజయవాడ, ఆంధ్రజ్యోతి : తెలుగుదేశం పార్టీ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ఈ ఏడాది ఆన్‌లైన్‌లో బుధ, గురువారాల్లో జరగనుంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావు పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏడాదీ మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజులపాటు టీడీపీ మహానాడును పండగ వాతావరణంలో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా కారణంగా భారీ సమావేశాలపై నిషేధం ఉన్నందున జూమ్‌ యాప్‌ ద్వారా 10వేల మందికి పైగా పార్టీ నాయకులతో ‘డిజిటల్‌ మహానాడు’ నిర్వహించేందుకు టీడీపీ నాయకత్వం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. మూడు రోజులు నిర్వహించే ఈ సమావేశాలను ఈ ఏడాది రెండు రోజులకు కుదించారు.


మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఇతర ముఖ్యనేతలు ఈ డిజిటల్‌ మహానాడులో పాల్గొననున్నారు. తొలిసారిగా వినూత్న పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ మహానాడులో జిల్లా నుంచి మూడు వేల మందికి పైగా టీడీపీ నాయకులు పాల్గొననున్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిల్లోనూ కీలక పాత్ర పోషించే ముఖ్యనాయకులు తమ నివాసాల నుంచే జూమ్‌ యాప్‌ ద్వారా మహానాడులో పాల్గొననున్నారు. ఇలా పాల్గొనే నాయకులకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి కోడ్‌ నెంబర్లు పంపించారు. ఆ కోడ్‌ నెంబర్ల ద్వారా లాగిన్‌ అయ్యి మహానాడులో పాల్గొనేలా ఇప్పటికే నాయకులందరికీ అవగాహన కల్పించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి దేవినేని  ఉమామహేశ్వరరావు విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి మహానాడులో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ డిజిటల్‌ మహానాడులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఇతర ముఖ్యనేతలు పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. 

Updated Date - 2020-05-27T08:38:29+05:30 IST