విద్యుత్ భవనం ఎదుట కార్మికుల మహాధర్నా
ABN , First Publish Date - 2022-08-09T05:03:52+05:30 IST
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినందుకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మహాధర్నాకు దిగారు.
విద్యుత్ అంతరాయానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి
సిద్దిపేట రూరల్, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినందుకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మహాధర్నాకు దిగారు. సోమవారం సిద్దిపేట జిల్లా విద్యుత్ ఉద్యోగ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ భవనం ఎదుట మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ అనుముల వీరభద్రయ్య మాట్లాడుతూ సమాజానికి వెలుగులు పంచుతున్న విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు, ముఖ్యంగా రైతులకు తీవ్రమైన నష్టం కలుగుతుందని మండిపడ్డారు. విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు ఆర్థికంగా కోలుకోరని వెల్లడించారు. విద్యుత్ సంస్థలు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతే ఉపాధి రంగం కుంటుపడుతుందన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2022కు వ్యతిరేకంగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన చేపట్టామని చెప్పారు. జనరేటింగ్ స్టేషన్లలో, జిల్లా కేంద్రాల్లో, ఎస్పీడీసీఎల్, కార్పొరేట్ ఆఫీస్, విద్యుత్ సౌధ నందు నల్లబ్యాడ్జీలు ధరించి మహాధర్నా ద్వారా నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ ధర్నాలో సబ్ స్టేషన్లలో అత్యవసర సేవల డ్యూటీల్లో ఉన్నవారు మినహాయించి మిగిలిన ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు.