MP Supriya Suleపై చేసిన వ్యాఖ్యలపై BJP నేత క్షమాపణ

ABN , First Publish Date - 2022-05-30T01:55:52+05:30 IST

మహారాష్ట్రలోని ఓబీసీలకు సైతం విద్యా, ఉద్యోగాల్లో కోటా అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ కొద్ది రోజులుగా నిరసన చేస్తోంది. అయితే మహారాష్ట్రలో కొనసాగుతోన్న ఈ నిరసనను మధ్యప్రదేశ్‌తో పోల్చారు సుప్రియ సూలె. ఈ నేపథ్యలో రాష్ట్రంలో..

MP Supriya Suleపై చేసిన వ్యాఖ్యలపై BJP నేత క్షమాపణ

ముంబై: ‘‘రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోపో’’ అంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(Nationalist Congress Party) నేత, ఎంపీ సుప్రియ సూలె(MP Supriya Sule)పై చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ(Maharashtra Bharatiya Janata Party) అధినేత చంద్రకాంత్ పాటిల్(Chandrakant Patil) క్షమాపణలు చెప్పారు. రాష్ట్రంలో ఓబీసీ కోటా(OBC quota)పై చెలరేగిన వివాదంలో ఇరు పార్టీల మధ్య పరస్పర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో గురువారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే పాటిల్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహారాష్ట్ర మహిళా కమిషన్ నుంచి ఆయన వ్యాఖ్యలపై నోటీసులు పంపించారు. దీంతో ఆయన దిగిరాక తప్పలేదు. ఆదివారం తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సుప్రియాకు క్షమాపణలు చెప్పారు.


మహారాష్ట్రలోని ఓబీసీలకు సైతం విద్యా, ఉద్యోగాల్లో కోటా అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ కొద్ది రోజులుగా నిరసన చేస్తోంది. అయితే మహారాష్ట్రలో కొనసాగుతోన్న ఈ నిరసనను మధ్యప్రదేశ్‌తో పోల్చారు సుప్రియ సూలె. ఈ నేపథ్యలో రాష్ట్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ఎవరినో కలిసి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు కసరత్తు ప్రారంభమైంది’’ అని అన్నారు. కాగా, దీనిపై చంద్రకాంత్ ఘాటుగా స్పందించారు. ‘‘మీరు రాజకీయాల్లో ఎందుకు ఉన్నారు? ఇంటికి వెళ్లి చక్కగా వంట చేసుకోండి. రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిని ఎలా కలవాలో తెలీదా? మీరు కూడా ఢిల్లీకి వెళ్లండి లేదా నరకానికి వెళ్లండి లేదా ఎక్కడైనా వెళ్లండి కానీ ఓబీసీ రిజర్వేషన్లు అమలులోకి తీసుకురండి’’ అని అన్నారు.


మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఓబీసీ కోటా అంశాన్ని సుప్రీంలో ఉంచి అన్యాయం చేస్తోందని ఆరోపించింది. కాగా, కేంద్ర ప్రభుత్వమే ఓబీసీ కోటాను అమలు కాకుండా అడ్డుకుంటోందని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సరైన డేటా ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని, ఓబీసీ కోటాకు బీజేపీనే అడ్డంకని విమర్శలు గుప్పించింది. ఇక సుప్రియపై చేసిన వ్యాఖ్యలు మహిళా లోకానికే అవమానమని ఆమె భర్త సదానంద సూలె అభిప్రాయపడ్డారు. భార్యగా, తల్లిగా, విజయవంతమైన రాజకీయవేత్తగా సుప్రియ నెంబర్‌వన్‌గా ఉన్నారని, దేశంలోని అత్యంత తెలివైన నాయకుల్లో సుప్రియ ఒకరని, ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

Updated Date - 2022-05-30T01:55:52+05:30 IST