పత్రికలే ప్రశ్నించే గొంతుక కావాలి

ABN , First Publish Date - 2022-06-27T07:48:28+05:30 IST

పత్రికలే ప్రశ్నించే గొంతుక కావాలి

పత్రికలే ప్రశ్నించే గొంతుక కావాలి

అగ్నిపథ్‌తో రైతు బిడ్డలకు నష్టం

సంక్షోభంలో వ్యవసాయ రంగం: పాలగుమ్మి 

నెల్లూరు (వైద్యం), జూన్‌ 26: ప్రజా సమస్యలను ఎప్పుటికప్పుడు పాలకుల దృష్టికి తెస్తూ ప్రజా గొంతుకగా పత్రికలు పనిచేయాలని దివంగత రాష్ట్రపతి వీవీ.గిరి మనవడు, ప్రముఖ జర్నలిస్టు, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ అన్నారు. నెల్లూరులో ఆదివారం జరిగిన డాక్ట ర్‌ జెట్టి శేషారెడ్డి స్మారక సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సంగ్రామంలో పత్రికలు ప్రధానపాత్ర పోషించాయని, కానీ.. నేడు మీడియా కార్పొరేట్‌ గుప్పిట్లోకి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ, అంబానీలను కాదని వార్తలు రాసే పరిస్థితి లేదన్నారు. హిందూ పత్రికలో రాఫెల్‌ గురించి ఎన్‌.రామ్‌ ఎడిటోరియల్‌ రాస్తే, ఆ పత్రికకు ప్రకటనలు రాకుండా అధికారంలో ఉన్నవారు అడ్డుకున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పత్రికల యాజమాన్యాలు తమ ఆదాయ మార్గాల కోసం వాస్తవాలను వెలికితీసేందుకు జంకుతున్నాయన్నారు. మీడియా రంగంలో గుత్తాధిపత్రాన్ని బద్దలు కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే దీర్ఘకాలికంగా, శాంతియుతంగా జరిగిన ఢిల్లీ రైతుల పోరాటం లాగా ప్రజా పోరాటాలు జరగాలన్నారు. ఆ పోరాట ఫలితం స్ఫూర్తితో పంజాబ్‌ ప్రజలు ఆప్‌కు పట్టం కట్టారని తెలిపారు. ఇండియన్‌ ఆర్మీలో 80 నుంచి 90 శాతం మంది రైతుల బిడ్డలు జవాన్లుగా ఉన్నారని, అగ్నిపథ్‌ పథకం వల్ల రైతు బిడ్డలకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, అనంతపురం జిల్లాలో రైతాంగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.

Updated Date - 2022-06-27T07:48:28+05:30 IST