ప్రియురాలి భర్తను భయపెట్టడానికి ఇద్దరు వ్యక్తుల్ని పంపించాడు.. కానీ చివరికి జరిగింది తెలిసి షాక్‌కు గురైన డాక్టర్.. ఇంతకీ ఏమైందంటే..

ABN , First Publish Date - 2021-10-18T21:28:16+05:30 IST

ప్రియురాలి భర్తకు..

ప్రియురాలి భర్తను భయపెట్టడానికి ఇద్దరు వ్యక్తుల్ని పంపించాడు.. కానీ చివరికి జరిగింది తెలిసి షాక్‌కు గురైన డాక్టర్.. ఇంతకీ ఏమైందంటే..

ఇంటర్‌నెట్‌డెస్క్: ప్రియురాలి భర్తకు వాళ్ల విషయం తెలిసింది. దీంతో భార్యను ప్రతిరోజూ వేధించడం మొదలుపెట్టాడు. ప్రియురాలి బాధను చూడలేని ప్రియుడు.. ఇద్దరు వ్యక్తుల్ని పంపి భర్తను బెదిరించాలనుకున్నాడు. కానీ భర్త దగ్గరకు వెళ్లిన ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన పనికి ప్రియుడు షాకయ్యాడు. పోలీసుల కథనం మేరకు..


మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినికి చెందిన ఆకాష్ మెదాకియా అనే వ్యక్తి ఏడాదిన్నర క్రితం వృతిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఇండోర్‌లోని వాల్మీకి నగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆకాష్ ఓ కంపెనీలో బీపీవో ఉద్యోగి. భార్య దేవస్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో బంగంగా ప్రాంతానికి చెందిన మనీష్ శర్మ అనే ఓ డాక్టర్‌తో వృతికకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 



వాళ్ల సంబంధం గురించి ఆకాష్‌కు తెలిసింది. అప్పటినుంచి ఇంట్లో గొడవలు జరగడం మొదలైంది. ప్రియురాలు ఫోన్ చేసి మనీష్‌కు తన బాధ చెప్పుకునేది. ఆకాష్‌లో భయం కలిగేలా చేయాలని మనీష్ తన ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు వ్యక్తులను పంపించాడు. అక్టోబర్ 13న ఉదయం 9గంటల సమయంలో వృతికను బస్‌స్టాప్‌లో వదిలి ఆకాష్ ఇంటికి బయలుదేరాడు. పోలో గ్రౌండ్ దగ్గర మనీష్ మనుషులు ఆకాష్‌ను చూసి.. బైక్‌ను పక్కకు ఆపమన్నారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేసినట్టు మనీష్ మనుషులు ఆకాష్‌ను బెదిరించడానికని వెళ్లి చంపేసి వచ్చారు. ఆకాష్ చనిపోయాడన్న విషయం తెలియగానే మనీష్ కంగుతిన్నాడు. 


స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆకాష్ జేబులో ఉన్న ఆధార్ కార్డ్ ఆధారంగా వృతికకు సమాచారం చేరవేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించి కొంతమందిని విచారించారు. చివరిగా మనీష్‌ మనుషులను పట్టుకున్నారు. నిందితులు దీనికంతటికీ కారణం మనీష్ అని చెప్పడంతో.. అతడిని స్టేషన్‌కు పట్టుకొచ్చారు. అతడు అసలు విషయం చెప్పడంతో.. వృతికను కూడా అరెస్టు చేశారు.


ఎస్పీ అశుతోష్ బాగ్రి మాట్లాడుతూ సీసీ ఫుటేజీలో కొంతమందిని అనుమానితులుగా గుర్తించామన్నారు. లోన్ లావాదేవీలు, అక్రమ సంబంధం కారణంగా హత్య చేసి ఉంటారని విచారణ ప్రారంభించామని, తమ అనుమానం నిజమైందన్నారు. ఆకాష్ భార్య వృతిక అలియాస్ మోనాకు డాక్టర్ మనీష్‌కు వివాహేతర సంబంధం ఉందని, వారి బంధాన్ని ప్రశ్నించిన ఆకాష్‌ను బెదిరించాలనుకున్నారని, కానీ మనీష్ మనుషులు అతడిని చంపేశారన్నారు. హత్యకు కారణమైన నలుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు.



Updated Date - 2021-10-18T21:28:16+05:30 IST