అన్నీ తెలిసినట్టు పోల్ ఎక్కిన విద్యుత్ మంత్రి... మరో వైర్ కట్ చేసి...
ABN , First Publish Date - 2021-06-19T17:40:00+05:30 IST
మధ్యప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్శాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్ తోమర్...
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్శాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్ తోమర్ తన విచిత్ర విన్యాసాలతో మరోమారు వార్తల్లోకి ఎక్కారు. సదరు మంత్రి తన నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేందుకు గ్వాలియర్లోని మోతీజీల్ ప్రాంతానికి వచ్చారు. స్థానికులు అతనిని మోతీజీల్ రైల్వే క్రాసింగ్ సమీపంలో అడ్డకుని, వారి సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. కొంతమంది విద్యుత్ సరాఫరాలోని సమస్యల గురించి మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే మంత్రి అక్కడికి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లి, మరమ్మతు చేసే ప్రయత్నం చేశారు.
ట్రాన్స్ఫార్మర్కు గడ్డి చుట్టుకుపోతున్న కారణంగా ఆ ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడుతోంది. మంత్రి స్వయంగా ఒక నిచ్చెన వేసుకుని స్థంభాన్ని ఎక్కి, మరమ్మతు చేసేందుకు ప్రయత్నించడాన్ని అక్కడున్నవారంతా ఆసక్తిగా తిలకించారు. తనకు తెలిసిన పని పూర్తిచేసిన తరువాత ఆయన స్థానిక విద్యుత్ అధికారులను అక్కడికి పిలిచి తీవ్రంగా మందలించారు. అయితే ఆ మంత్రి విద్యుత్ సరఫరాను చక్కదిద్దేందుకు బదులు ఒక విద్యుత్ తీగను కట్ చేశారు. దీంతో కొన్ని గంటలపాటు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఆ మంత్రిపై చిర్రుబుర్రులాడుతున్నారు. మంత్రి చేసిన పని చట్టవిరుద్ధమని వారు ఆరోపిస్తున్నారు.