యూట్యూబ్ చూస్తూ సమయం వృథా చేసుకుంటున్నారనుకున్నారు.. కానీ పిల్లలిద్దరూ చేసిన పనికి.. ఆశ్యర్యపోయిన తల్లిదండ్రులు!
ABN , First Publish Date - 2021-10-01T15:51:38+05:30 IST
లాక్డౌన్ కారణంగా..
దేవస్(మధ్యప్రదేశ్): లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. పిల్లలను బయటకు పంపించే పరిస్థితి కూడా అప్పట్లో లేదు. దీంతో చాలామంది విద్యార్థులు సెల్ఫోన్లో గేమ్లు ఆడుతూ, యూట్యూబ్లో వీడియోలు చూస్తూ సమయాన్ని వృథా చేసుకునే వారు. తమ పిల్లలు కూడా యూట్యూబ్ చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారే అని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఓ రోజు వారి పిల్లలు చేసిన పని చూసి ఆశ్యర్యపోయారు. అసలు విషయంలోకి వెళ్తే..
మధ్యప్రదేశ్లోని దేవస్ ప్రాంతంలోని బాల్గఢ్ ప్రాంతానికి చెందిన ఓ దంపతులకు 13ఏళ్ల నేహా రాథోడ్, 10ఏళ్ల వివేక్ అనే ఇద్దరు పిల్లలున్నారు. లాక్డౌన్ కారణంగా పిల్లలకు స్కూల్ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నారు. ప్రతిరోజూ పిల్లలు యూట్యూబ్ చూస్తూ సమయం వృథా చేసుకుంటున్నారే అని తల్లిదండ్రులు తీవ్రంగా మదన పడేవారు. చదువుకోమని చెబితే ఎంతకీ వినకపోవడంతో వారిష్టంలే అని వదిలేశారు. కానీ ఓరోజు పిల్లలు యూట్యూబ్ చూస్తూ చేసిన పనికి ఆశ్యర్యపోయారు. పిల్లలిద్దరూ పెన్సిల్తో బొమ్మలు వేయడం చూసి ఆనందపడిపోయారు. ఇన్నాళ్లు తమ పిల్లలు యూట్యూబ్లో కార్టూన్ వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారనుకున్నారు. కానీ వాళ్లు పెన్సిల్తో బొమ్మలు గీయడం చూసి ముచ్చటపడ్డారు. కేవలం మూడు, నాలుగు నెలల కాలంలోనే బొమ్మలు చక్కగా గీయడం నేర్చుకున్నారు. ఏ బొమ్మను అయినా నిమిషాల్లోనే గీయగలినే నైపుణ్యం ఆ పిల్లలిద్దరూ సంపాదించుకున్నారు.
తండ్రి మహేష్ రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ గ్రేడ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తల్లి మమతా రాథోడ్ గృహిణి. పిల్లలకు పెన్సిల్లో బొమ్మలు గీయడంలో ఉన్న ఇంట్రెస్ట్ చూసి వారిని ప్రోత్సహించారు. నేహా, వివేక్ ప్రస్తుతం ఎవరి స్కెచ్ అయిన నిమిషాల్లో గీయగలరు. దేవస్ కలెక్టర్ చంద్రమౌళి శుక్లా, ఎస్పీ శివదయాల్ సింగ్ స్కెచ్ వేసి వారి కార్యాలయంలో అందజేశారు. ఇద్దరు పిల్లలను కలెక్టర్, ఎస్పీ అభినందించారు. అదే సమయంలో వారి ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటూ, ప్రముఖ కళాకారుల శిక్షణలో మరింత ప్రావీణ్యం సంపాదించమని కోరారు.