మధుమాంస భక్షిణి.. కాళీ
ABN , First Publish Date - 2022-07-06T08:36:10+05:30 IST
కాళీమాత మధుమాంస భక్షిణి అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
టీఎంసీ ఎంపీ మహువ మోయిత్ర వివాదాస్పద వ్యాఖ్య
‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదంపై తీవ్రంగా స్పందన
న్యూఢిల్లీ, జూలై 5: కాళీమాత మధుమాంస భక్షిణి అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘కాళీ మాత మధుమాంసాలను స్వీకరించే దేవతగానే నాకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె ఇండియాటుడే కాన్క్లేవ్ 2022లో మాట్లాడుతూ ఈ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రిథమ్ ఆఫ్ కెనెడాలో భాగంగా ‘కాళీ’ పేరుతో వచ్చిన ఓ పోస్టర్ వివాదాస్పదమవుతోంది. ఆ పోస్టర్లో హిందూ దేవత కాళీమాత, ఎల్జీబీటీ(స్వలింగ సంపర్కులు) జెండాను చేతబట్టుకుని, ధూమపానం చేస్తున్నట్లు చిత్రీకరించారు. ప్రస్తుతం టొరెంటోలో ఉంటోన్న తమిళనాడులోని మదురైకి చెందిన లీనా మణిమేకలై అనే దర్శకురాలు ఈ డాక్యుమెంట్ను చిత్రీకరించి, పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం నెటిజన్లు లీనా తీరుపై భగ్గు మంటున్నారు. ఢిల్లీలో పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పోస్టర్ వివాదంపై ఎంపీ మహువా స్పందిస్తూ.. కాళీమాత సిగరెట్ తాగుతుందో లేదో తేలియదని పరోక్షంగా చెబుతూ.. ఆమె మధుమాంస భక్షిని అన్నారు. ఆ వ్యాఖ్యలు వైరల్ కావడం.. నెటిజన్ల నుంచి విమర్శలు వస్తుండడంతో ఆ తర్వాత మోయిత్రా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సంఘ్ పరివార్కు నేను చెప్పేది ఒక్కటే. అబద్ధాలతో ఉత్తమ హిందువులుగా మారలేము. నేను ఏ పోస్టర్కు మద్దతివ్వలేదు. తారాపీఠ్లోని కాళీ మందిర్కు వెళ్లండి. అక్కడ అమ్మవారికి భోగం కింద ఆహారంగా, పానీయాలుగా ఏమిస్తున్నారో తెలుసుకోండి. జై మా తారా’’ అన్నారు.