మానవత్వం పరిమళించే..
ABN , First Publish Date - 2021-01-25T04:47:52+05:30 IST
మండలంలోని మునిగేపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ల మాధవి అనే నిరుపేద ఇంటి నిర్మాణానికి సంఘ సంస్కర్త ఎంఎస్ శ్రీదేవి ముందు కొచ్చారు.
నిరుపేద కుటుంబం ఇంటినిర్మాణానికి ముందుకొచ్చిన సంఘసంస్కర్త శ్రీదేవి
మహిళను సత్కరించిన అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్
కూసుమంచి, జనవరి 24: మండలంలోని మునిగేపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ల మాధవి అనే నిరుపేద ఇంటి నిర్మాణానికి సంఘ సంస్కర్త ఎంఎస్ శ్రీదేవి ముందు కొచ్చారు. ఇంటినిర్మాణానికి రూ.నాలుగు లక్షలు అందించారు. గ్రామానికి చెందిన మాధవి భర్త కొంతకాలం క్రితం చనిపోయాడు. ఇద్దరు చిన్న పిల్లలతో ఇల్లులేకుండా నానా కష్టాలు పడుతోంది. ఈక్రమంలో నిరుపేదలను గుర్తించి వారికి ఆర్థికసాయం అందించే సంఘసంస్కర్త ఎంఎస్ శ్రీదేవి మునిగేపల్లి గ్రామానికి వచ్చారు. గ్రామసర్పంచి గుగ్గిళ్ల మోహన్, ఉపసర్పంచి ముక్క శ్రీనివాసరావు.. మాధవి కష్టాలను శ్రీదేవి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ఇంటినిర్మాణానికి ముందుకు వచ్చారు. అనుకున్నదే తడవుగా గ్రామస్ధుల సమక్షంలో ఆదివారం ఇంటినిర్మాణానికి ముగ్గుపోసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొనాలని గ్రామపెద్దలు అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్(ఐహెచ్ఆర్సీ) జిల్లా కమిటీ సభ్యులను ఆహ్వానించారు. వారు సందర్శించారు. తెలంగాణ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహారావు, జిల్లా అధ్యక్షుడు కరాటే మధు, జిల్లా ప్రధానకార్యదర్శి నూతన్ విజయకృష్ణారావు, అర్జున్, రాములు, పలువురు గ్రామపెద్దలు పాల్గొన్నారు. నిరుపేద మహిళలను గుర్తించి ఆర్ధికసాయం అందిస్తున్న ఎంఎస్ శ్రీదేవిని ఐహెచ్ఆర్సీ బృందం సత్కరించింది.