రెక్కల కష్టం.. నేలపాలు

ABN , First Publish Date - 2021-05-06T08:52:14+05:30 IST

ఇది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌. రైతులు ఆరుగాలం పండించి తెచ్చిన టమాటాలను కొనేవారు లేక, ఇలా పారబోసి పోయారు.

రెక్కల కష్టం.. నేలపాలు

ఇది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌. రైతులు ఆరుగాలం పండించి తెచ్చిన టమాటాలను కొనేవారు లేక, ఇలా పారబోసి పోయారు. రెండు రోజులుగా మార్కెట్‌ ఆవరణ ఎర్రటి వ్యర్థాలతో నిండిపోవడంతో అధికారులు బుధవారం ట్రాక్టర్లతో వాటిని బయటికి తరలించారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు కర్ణాటక నుంచి రోజూ సగటున 800 టన్నుల టమాటాలు మదనపల్లె మార్కెట్‌కు వస్తున్నాయి. ఇందులో ఏ గ్రేడ్‌ రకం మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా 30 కిలోల క్రేటు గరిష్ఠంగా రూ.40-30 పలుకుతోంది. అంటే కిలోకు రూపాయి మాత్రమే ధర లభిస్తోంది. ఇక రెండు, మూడో రకం టమాటాలను కొనేవారే లేరు. ఇక మార్కెటింగ్‌ శాఖ అధికారులు తాము ముందుగా ఎంచుకున్న ఒకటి, రెండు మండలాల నుంచి రోజుకు నాలుగైదు టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అది కూడా కిలో రూ.2కు మించడం లేదు. పంట అమ్మితే.. కూలి ఖర్చులే కాదు, వాహనం బాడుగకు కూడా సరిపడా డబ్బు రావడంలేదు. దీంతో చాలామంది రైతులు పొలాల్లోనే పశువుల మేతగా పంటను వదిలేస్తున్నారు.

- మదనపల్లె

Updated Date - 2021-05-06T08:52:14+05:30 IST